AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడారంలో క్రౌడ్ బరస్ట్.. వనం నుంచి జనంలోకి సమ్మక్క.. AK 47 తూటాలతో ఘన స్వాగతం..!

లక్షలాది మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మేడారం వన దేవతల జన ప్రవేశం పూర్తయింది. కన్నెపల్లి నుండి సారలమ్మ, చిలుకలగుట్ట నుండి సమ్మక్క దేవతలు ఇద్దరూ గద్దెలపై ప్రతిష్టాపన చేయడంతో భక్త జనకోటికి దర్శనమిస్తున్నారు. మహిమాన్వితురాలైన సమ్మక్క తల్లి రాకతో మేడారం ప్రాంగణం పులకించిపోయింది. శక్తి పీఠంగా మారిన మేడారం గద్దెల ప్రాంగణానికి భక్తకోటి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

మేడారంలో క్రౌడ్ బరస్ట్.. వనం నుంచి జనంలోకి సమ్మక్క.. AK 47 తూటాలతో ఘన స్వాగతం..!
Medaram Mahajatara
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 7:21 AM

Share

లక్షలాది మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మేడారం వన దేవతల జన ప్రవేశం పూర్తయింది. కన్నెపల్లి నుండి సారలమ్మ, చిలుకలగుట్ట నుండి సమ్మక్క దేవతలు ఇద్దరూ గద్దెలపై ప్రతిష్టాపన చేయడంతో భక్త జనకోటికి దర్శనమిస్తున్నారు. మహిమాన్వితురాలైన సమ్మక్క తల్లి రాకతో మేడారం ప్రాంగణం పులకించిపోయింది. శక్తి పీఠంగా మారిన మేడారం గద్దెల ప్రాంగణానికి భక్తకోటి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మేడారం పరిసరాలన్నీ సమ్మక్క-సారక్క నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ రోజు శుక్రవారం (జనవరి 30) తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో సహా పలువురు ప్రముఖులు తల్లుల దర్శనానికి తరలి రానున్నారు.

భక్తజనం.. భక్తిభావం ఎదురు చూసిన అద్భుత దృశ్యం మేడారంలో ఆవిష్కృతమైంది. మేడారం మూలదేవత సమ్మక్క గద్దెలపైకి చేరారు. పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో గద్దెలపైకి చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ దివాకర ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క తల్లికి ఆగమనానికి గౌరవ సూచికంగా జిల్లా ఎస్పీ సుదీర్ రామ్‌నాథ్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపి అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికారు.

మహా జాతరలో తొలిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. రెండవ రోజు గురువారం ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క గద్దెలపైకి చేరుకున్నారు. గురువారం ఉదయం నుండి ప్రత్యేకపూజలు చేసి, వడ్డెలు, సమ్మక్క ఆగమనం కోసం మొదట సమ్మక్క గద్దెపై వన ప్రతిష్ట చేశారు. ఆ తర్వాత చిలుకల గుట్టకు వెళ్ళి రహస్య పూజలు నిర్వహించారు. సాయంత్రం 6:43 నిమిషాలకు కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను పూజారులు చిలుకలగుట్ట నుండి కిందకు తీసుకువచ్చారు. సమ్మక్క ఆగమన మహాఘట్టం మొదలు కావడంతో ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ AK-47 గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు.

సమ్మక్క తల్లి వనం నుండి జనంలోకి వస్తుండడంతో చిలకలగుట్ట రహదారులు భక్తులతో నిండిపోయాయి. సమ్మక్క తల్లికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు రహదారులపై రంగవల్లులు, జంతు బలులు, ఎదుర్కోళ్ళు సమర్పించి తన్మయత్వంలో మునిగి పోయారు. చిన్నా, పెద్దా, యువతీయువకులు అనే తేడా లేకుండా జై సమ్మక్క తల్లి నినాదాలతో మేడారం మార్మోగిపోయింది. శివసత్తుల పూనకాలు, సమ్మక్క తల్లిని ఆవహించుకుని భక్తుల నృత్యాల మధ్య అమ్మవారి ఆగమనం దిగ్విజయమైంది. ఆదివాసి గిరిజన సంఘాలు, అభ్యుదయ యువజన సంఘం, తుడుందెబ్బ, ప్రత్యేక పోలీసు బలగాలు అమ్మవారికి నాలుగు అంచెల భద్రత ఇచ్చాయి.

రాత్రి 9:30 నిమిషాలకు సమ్మక్క తల్లి గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. సమ్మక్క తల్లి రాకతో గద్దెల ప్రాంగణంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 9:34 నిమిషాలకు సమ్మక్కను గద్దెపైకి చేర్చారు పూజారులు. 9:54 వరకు రహస్య పూజల తంతు నిర్వహించి అమ్మవారిని గద్దెపై ప్రతిష్టాపన చేశారు. సమ్మక్క ప్రతిష్టాపన పూర్తవగానే అధికారికంగా తొలి మొక్కులు దేవాదాయశాఖ నిర్వహించింది. మంత్రి సీతక్కతో కలిసి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమ్మక్క తల్లికి పూలమాల వేసి.. చీరె, సారె, పసుపు, కుంకుమలు, గాజుకు అందించారు. రాత్రి 10:04 నిమిషాల నుండి భక్తులకు సమ్మక్క తల్లి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు.

నలుగురు దేవతలు గద్దెలపై కొలువై ఉండడంతో అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. జంపన్నవాగు నుండి మొదలుకుని క్యూ లైన్ల వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. ఈరోజు, రేపు భక్తుల దర్శనార్థం వనదేవతలు గద్దెలపైనే ఉంటారు. రేపు సాయంత్రం దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. లక్షల సంఖ్యలో మేడారానికి తరలి వస్తున్న భక్తులతో మేడారం గ్రామం విశ్వనగరాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది.

జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తల్లుల వద్దకు మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీగా భక్తులు రావడంతో మేడారం దారులు కిక్కిరిసిపోయాయి. వనదేవతలు గద్దెలపై చేరడంతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి.. భక్తి భావం ఉప్పొంగి పోయింది.. గద్దెల మహాప్రాంగణం శక్తిపీఠంగా మారి భక్తులకు దీవెనలు అందిస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us