AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్నాథ రథయాత్రలో ముస్లిం భక్తుడి సమాధి ముందు రథం ఎందుకు ఆగుతుంది? భక్త సాల్‌బేగ్ హృదయాన్ని కదిలించే కథ!

Jagannath Rath Yatra 2026: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో ప్రతి ఏడాది ముస్లిం భక్తుడు సాల్‌బేగ్ సమాధి ముందు జగన్నాథుడి రథం ఎందుకు కొద్దిసేపు ఆగుతుంది? భక్తి మతానికి అతీతమని చాటిచెప్పే భక్త సాల్‌బేగ్ జీవితకథ, ఈ విశ్వాసం వెనుక ఉన్న ఆసక్తికరమైన గాథను తెలుసుకోండి.

జగన్నాథ రథయాత్రలో ముస్లిం భక్తుడి సమాధి ముందు రథం ఎందుకు ఆగుతుంది? భక్త సాల్‌బేగ్ హృదయాన్ని కదిలించే కథ!
Jagannath Rath Yatra 2026 Salabega Story
Rajashekher G
|

Updated on: Jul 16, 2026 | 4:51 PM

Share

Bhakta Salabega: ఒడిశాలోని పూరీలో జరిగే ‘శ్రీ జగన్నాథ రథయాత్ర’ ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ పవిత్ర యాత్రలో జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి శ్రీమందిరం నుంచి గుండిచా ఆలయానికి రథాలపై ఊరేగింపుగా వెళ్తారు. ఈ యాత్రతో ముడిపడి ఎన్నో విశేషాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటిలో అత్యంత హృదయాన్ని తాకే కథ ‘ముస్లిం భక్తుడు సాల్‌బేగ్’ ది. భక్తి అనేది మతానికి అతీతమని, భగవంతుని దృష్టిలో నిజమైన విశ్వాసమే గొప్పదని ఈ కథ నేటికీ గుర్తు చేస్తోంది. అందుకే ప్రతి ఏడాది రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి రథం సాల్‌బేగ్ సమాధి వద్ద కొద్దిసేపు ఆగడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.

సాల్‌బేగ్ సమాధి ముందు రథం ఎందుకు ఆగుతుంది?

స్థానిక విశ్వాసం ప్రకారం, ఒకసారి జగన్నాథుడి రథం శ్రీమందిరం నుంచి గుండిచా ఆలయానికి వెళ్తుండగా, సాల్‌బేగ్ సమాధి సమీపానికి చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయింది. వేలాది మంది భక్తులు రథాన్ని లాగినా అది ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. అప్పుడు అక్కడికి వచ్చిన ఓ వృద్ధుడు, “ఇది భక్తుడు సాల్‌బేగ్ స్థలం. ముందుగా ఆయనను స్మరించండి” అని చెప్పాడని కథనం. వెంటనే భక్తులు “జై జగన్నాథ్”… “జై భక్త సాల్‌బేగ్” అంటూ నినాదాలు చేయగా, రథం మళ్లీ కదలడం ప్రారంభించిందని విశ్వసిస్తారు.

ఈ సంఘటన తర్వాత నుంచి జగన్నాథుడు తన ప్రియ భక్తుడికి గౌరవం తెలుపుతూ ప్రతి రథయాత్రలో సాల్‌బేగ్ సమాధి వద్ద కొద్దిసేపు ఆగుతాడనే విశ్వాసం బలపడింది.

ఇవి కూడా చదవండి

భక్తుడు సాల్‌బేగ్ ఎవరు?

జానపద కథనాల ప్రకారం, సాల్‌బేగ్ మొఘల్ కాలానికి చెందిన ప్రముఖ భక్తుడు. ఆయన తండ్రి ముస్లిం, తల్లి హిందూ. ఒక యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సాల్‌బేగ్‌కు, తన తల్లి జగన్నాథ స్వామిని ప్రార్థించాలని సూచించింది. తల్లి చెప్పిన జగన్నాథుని మహిమలు ఆయన హృదయంలో అపారమైన భక్తిని నింపాయి. అనంతరం పూరీకి చేరుకున్న సాల్‌బేగ్.. ముస్లింగా జన్మించిన కారణంగా ఆలయంలోకి ప్రవేశించలేకపోయాడు. అయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా ఆలయం వెలుపలే నివసిస్తూ జగన్నాథుని నామస్మరణ, భజనలు, కీర్తనలు చేస్తూ జీవితాన్ని గడిపాడు. కాలక్రమేణా ఆయన భక్తి అంతటి స్థాయికి చేరుకుంది కాబట్టి, సాల్‌బేగ్‌ను జగన్నాథుడి అత్యంత ప్రియ భక్తులలో ఒకరిగా భక్తులు గౌరవించడం ప్రారంభించారు.

సాల్‌బేగ్ చివరి కోరిక ఏమిటి?

ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, జీవితాంతంలో సాల్‌బేగ్‌కు ఒకే ఒక్క కోరిక ఉండేది… ప్రతి రథయాత్రలో జగన్నాథుడిని దర్శించుకోవడం. తన మరణానంతరం కూడా తన స్థలాన్ని దాటి వెళ్లే ముందు రథం తన వద్ద ఆగాలని ఆయన మనసారా కోరుకున్నాడని చెబుతారు. ఆయన అపారమైన భక్తికి మెచ్చిన జగన్నాథ స్వామి, “నా రథయాత్ర నీ సమాధి వద్ద ఆగిన తర్వాతే ముందుకు సాగుతుంది” అని వరమిచ్చాడనే విశ్వాసం నేటికీ భక్తుల్లో బలంగా ఉంది. అందుకే ప్రతి ఏడాది రథయాత్ర సందర్భంగా సాల్‌బేగ్ సమాధి వద్ద రథం కొద్దిసేపు నిలిపి, అనంతరం గుండిచా ఆలయం వైపు ప్రయాణం కొనసాగిస్తారు.

(Disclaimer: సాల్‌బేగ్ జీవితానికి సంబంధించిన ఈ కథ ప్రధానంగా ఒడిశాలో ప్రాచుర్యంలో ఉన్న జానపద విశ్వాసాలు, స్థానిక సంప్రదాయాల ఆధారంగా చెప్పబడుతుంది. చారిత్రక వివరాలు, భక్తి కథనాలు వేర్వేరు రూపాల్లో ప్రచారంలో ఉన్నాయి.)

Follow Us