విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగంలో రథోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యం
Jagannath Rath Yatra 2026: ఆషాఢ శుక్ల విదియ సందర్భంగా పూరీ జగన్నాథ రథయాత్ర 2026 నేడు వైభవంగా ప్రారంభమవుతోంది. రవి యోగంలో జరిగే ఈ మహోత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మూడు భారీ రథాలపై గుండిచా ఆలయానికి ప్రయాణిస్తారు. రథయాత్ర విశిష్టత, మూడు రథాల ప్రత్యేకత, భక్తులు రథపు తాడు లాగడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

Jagannath Rath Yatra 2026 Begins Today: ఆషాఢ మాసం శుక్ల పక్ష విదియ (ద్వితీయ) నాడు నిర్వహించే పురీ జగన్నాథ రథయాత్ర హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటి. ఈ ఏడాది జూలై 16న రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతోంది. ఒడిశాలోని పూరీ శ్రీ జగన్నాథ ఆలయం నుంచి జగన్నాథ స్వామి, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి గుండిచా ఆలయానికి రథాలపై బయలుదేరుతారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పూరీకి తరలివస్తారు. ఈ ఏడాది రథయాత్ర జూలై 24న జరిగే బహుదా యాత్ర (తిరుగు ప్రయాణం)తో ముగియగా, జూలై 27న నీలాద్రి బిజే ఆచారంతో ఉత్సవాలు పూర్తవుతాయి. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, నేడు సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. ఇదే రోజున రవి యోగం కూడా ఉండటంతో ఈ రథోత్సవానికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడింది.
జగన్నాథ రథయాత్ర ఎందుకు నిర్వహిస్తారు?
పురాణాల ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి తన అత్తగారి ఇల్లు అని భావించే గుండిచా దేవి ఆలయానికి వెళ్తారు. అక్కడ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి శ్రీమందిరానికి చేరుకుంటారు. ఈ దైవయాత్రనే జగన్నాథ రథయాత్రగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారు ఆలయం వెలుపలికి వచ్చి అందరికీ దర్శనమివ్వడం విశేషం. సాధారణంగా ఆలయంలోకి ప్రవేశించలేని వారు కూడా రథయాత్ర సమయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం పొందుతారు. అందుకే దీనిని “ప్రజల మధ్యకు వచ్చే దేవుడి ఉత్సవం”గా కూడా అభివర్ణిస్తారు.
రథపు తాడు లాగితే కలిగే పుణ్యం
భక్తుల విశ్వాసం ప్రకారం, జగన్నాథుని రథాన్ని లాగడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. పూర్వజన్మల పాపాలు తొలగి, జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. అందుకే కుల, మత, వర్గ భేదాలు లేకుండా లక్షలాది మంది భక్తులు రథపు తాళ్లను లాగేందుకు పోటీపడతారు. భగవంతుని ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని ఈ రథయాత్ర ప్రపంచానికి చాటిచెబుతుంది.
మూడు రథాల ప్రత్యేకత ఇదే
జగన్నాథ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం వేప చెక్కతో మూడు భారీ రథాలను కొత్తగా నిర్మిస్తారు. ఒక్కో రథానికి ప్రత్యేక పేరు, రంగు, నిర్మాణ శైలి ఉంటుంది.
బలభద్రుని రథం – తలధ్వజం (Taladhwaja): ఎరుపు-ఆకుపచ్చ రంగులతో అలంకరిస్తారు. ఈ రథమే ముందుగా ప్రయాణం ప్రారంభిస్తుంది. సుభద్రాదేవి రథం – దర్పదాలన (Darpadalana) లేదా పద్మరథం: నీలం-నలుపు రంగులతో ఉంటుంది. ఇది మధ్యలో ప్రయాణిస్తుంది. జగన్నాథ స్వామి రథం – నందిఘోష (Nandighosha) లేదా గరుడధ్వజం: ఎరుపు-పసుపు రంగులతో అలంకరించిన ఈ రథం చివరగా కదులుతుంది.
రథయాత్ర విశిష్టత
జగన్నాథ రథయాత్ర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. భక్తి, సమానత్వం, సేవాభావానికి ప్రతీకగా నిలిచే మహోత్సవం. ప్రపంచంలోనే మూల విరాట్టులను ఆలయం వెలుపల రథాలపై ఊరేగించే అరుదైన సంప్రదాయం పూరీ జగన్నాథ రథయాత్రకే ప్రత్యేకం. అందుకే ప్రతి ఏడాది ఈ దివ్యోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పూరీకి తరలివస్తారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




