Srisailam Temple: శ్రీశైలం ఆలయం పై నిఘా నీడ.. దేవస్థాన టోల్గేటు వద్ద ముమ్మర తనిఖీలు
భారత్, పాక్ దేశాల మధ్య రోజు రోజుకీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దేశాల మధ్య దాడులు ప్రతి దాడులు గా ఉన్న పరిస్థితి.. పూర్తిస్తాయిలో యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో మనదేశంలో సరిహద్దు ప్రాంతాలు మాత్రమే కాదు ప్రాముఖ్య పుణ్య క్షేత్రాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఏపీలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న నేతృత్వంలో భద్రతా సిబ్బంది శ్రీశైలం టోల్గేట్ వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు. దేశంలో ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భద్రత కట్టుదిట్టం చేశారు .ఇదే క్రమంలో శ్రీశైలం ఆలయానికి వస్తున్న వాహనాలను అణువణువు క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రం లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే శ్రీశైలం దేవస్థానం సీసీటీవీ కంట్రోల్ రూమ్ నందు నిరంతరం నిఘా కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టిన ఆలయ అధికారులు శ్రీశైల క్షేత్ర పరిధిలో పెట్రోలింగ్ సిబ్బందితో ఆయా పరిసరాలను పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..