TTD: వెంకన్న దర్శనంలో ఇప్పుడు అందరూ విఐపీలే.. సామాన్య భక్తుడికి గంటలో శ్రీవారి దర్శనం..

ఎన్నికల కోడ్ వెంకన్న భక్తులకే కాదు టీటీడీకి కూడా కలిసి వచ్చింది. వీఐపీలు తగ్గిపోవడం, సిఫారసులేఖలను రద్దు చేయడం లాంటి అంశాలు సర్వదర్శనం చేసుకునే భక్తులకు మరింత సమయం కలిసి వచ్చేలా చేసింది. సిఫారసుల గోల లేకుండా శ్రీవాణి టికెట్ల జారీ అన్ లిమిటెడ్ చేసిన టిటిడి రోజుకు 80 వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.

TTD: వెంకన్న దర్శనంలో ఇప్పుడు అందరూ విఐపీలే.. సామాన్య భక్తుడికి గంటలో శ్రీవారి దర్శనం..
Ttd Darshan
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 01, 2024 | 5:19 PM

ఎన్నికల కోడ్ వెంకన్న భక్తులకే కాదు టీటీడీకి కూడా కలిసి వచ్చింది. వీఐపీలు తగ్గిపోవడం, సిఫారసులేఖలను రద్దు చేయడం లాంటి అంశాలు సర్వదర్శనం చేసుకునే భక్తులకు మరింత సమయం కలిసి వచ్చేలా చేసింది. సిఫారసుల గోల లేకుండా శ్రీవాణి టికెట్ల జారీ అన్ లిమిటెడ్ చేసిన టిటిడి రోజుకు 80 వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో తిరుమల కొండకు వచ్చే భక్తులకు లభిస్తున్న సంతృప్తికర దర్శనం టీటీడీ ప్రశంసలు అందుకునేలా చేసింది.

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం. నిత్యం భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం. క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలని ప్రయాసపడే భక్తులు ప్రపంచంలోని నలుమూలల నుంచి కొండకు చేరుకోవడం నిత్యకృత్యం. ఆపదమొక్కుల స్వామి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల కొండపై శ్రీవారి దర్శనం ఒక పెద్ద టాస్క్. సర్వదర్శనంతో పాటు రూ.300 స్పెషల్ ఏంట్రీ దర్శనం, సిఫారసు లేఖలతో విఐపి దర్శనం, ప్రోటోకాల్, శ్రీవాణి ట్రస్ట్, డోనర్స్ ప్రివిలైజ్ ఇలా పలు రకాలుగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండెక్కుతారు. నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా ఎవరి దారి వారిది అన్నట్టుగా తిరుమల కొండకు చేరే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లోనే ఉంటుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం గంటల తరబడి కాదు రోజుల తరబడి క్యూలైన్‎లలో వేచి ఉండే భక్తులు క్షణం పాటు వెంకన్న దర్శనం తీసుకుని కష్టాన్ని మరిచిపోతారు.

ఇలా కొండమీద శ్రీవారి భక్తులు పడుతున్న అగచాట్లకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. సామాన్య భక్తుడికి సంతృప్తికర సర్వదర్శనం చేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టైం స్లాటెడ్ టోకన్లను జారీ చేయడం ఆన్ లైన్‎లో ముందుగానే టికెట్లను జారీ చేయడం చేస్తుంది. మరోవైపు సిఫారసు లేఖలపై ఆధారపడకుండా శ్రీ వాణి ట్రస్ట్ కింద రూ. 10 వేలు డొనేషన్ చెల్లిస్తే ప్రివిలైజ్‎గా రూ.500 విఐపి బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా కొండకు వచ్చే భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తుండగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం సర్వదర్శనం భక్తులకే కాదు విఐపిలకు సిఫారసు లేఖల గోల లేకుండా చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాక ముందు వరకు దాదాపు 4 వేల మందికి పైగా భక్తులు సిఫారసు లేఖలతో విఐపి బ్రేక్ దర్శనాలను పొందుతూ వచ్చారు.

ఇవి కూడా చదవండి

విఐపిల బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి ట్రస్ట్, డోనర్స్, ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే భక్తులకు దాదాపు 4 గంటల సమయం టిటిడి కేటాయిస్తూ వచ్చింది. కోడ్ అమలులోకి రావడంతో విఐపి సిఫారసు లేఖలను రద్దు చేసిన టిటిడి ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా నిలిపి వేసింది. దీంతో విఐపి ప్రోటోకాల్ దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజు 200 కు మించడంలేదు. మరోవైపు శ్రీవాణి టికెట్స్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే భక్తులతో కలిపి వీఐపీల సంఖ్య 2 వేలకు మించకపోవడంతో సర్వ దర్శనానికి గంట సమయం మాత్రమే పడుతుంది. విఐపి సిఫారసు లేఖలు స్వీకరించని టిటిడి వీఐపీలకు ఇబ్బంది కలగకుండా శ్రీవాణి టికెట్లను అన్ లిమిటెడ్ చేసింది. గతంలో 500 టికెట్లు ఆన్ లైన్‎లో మరో 500 టికెట్లు ఆఫ్ లైన్‎లో జారీ చేస్తున్న టిటిడి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అవసరమైనన్ని టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10 వేలు డొనేషన్ చెల్లించే భక్తుడు రూ.500 టికెట్ కొనుగోలు చేసి విఐపి బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం అందుబాటులోకి రావడంతో శ్రీవాణి టికెట్లకు గిరాకీ పెరిగింది.

రోజుకు దాదాపు రెండు వేల వరకు శ్రీవాణి టిక్కెట్లను విక్రయిస్తున్న టీటీడీ శ్రీవారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలుగుతుంది. వీఐపీలు తగ్గిపోవడంతో వారికి కేటాయించిన సమయం సర్వదర్శనం భక్తులకు కలిసి వస్తుంది. గంటకు 4,500 మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ క్యూ లైన్ మేనేజ్మెంట్ చేస్తుడటంతో సామాన్య భక్తుడికి సంతృప్తికర దర్శనం అందుతోంది. అంతే కాకుండా తిరుమల వెంకన్న ఆదాయం కూడా అంతకంతకు పెరుగుతోంది. గత 25 నెలలుగా వరుసగా హుండీ ఆదాయం వంద కోట్లకు పైగా నమోదు అవుతుండగా మార్చి నెల ఆదాయం కూడా రూ.118 కోట్లకు చేరుకుంది. ఎన్నికల కోడ్ అమలుతో శ్రీవారి ఆదాయం అమాంతంగానే పెరిగింది. ఒకవైపు వేసవి శెలవులు, పరీక్షలు రాసిన విద్యార్థుల మొక్కులు, మరోవైపు ఎన్నికల సమయంలో మొక్కులు తీర్చుకునే వారి సంఖ్య పెరగడంతో తిరుమల కొండ కూడా కిటకిటలాడుతోంది. అదే రీతిలో వెంకన్న హుండీ కూడా గలగలలాడుతుంది.

ఎన్నికల కోడ్‎తో మార్చి 16 నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయడం, శ్రీవాణి టికెట్లు అడిగినన్ని ఇవ్వడంతో ఆదాయం పెరిగింది. ఏ ఒక్కరి సిఫారసు అవసరం లేకుండానే శ్రీవాణి టికెట్టును కొనుగోలు చేసి వెంకన్నను దర్శించుకునే అవకాశం టిటిడి కల్పించడం పట్ల భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెంకన్న భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్స్ కోటాను పెంచిన టిటిడి ఈ మేరకు గణనీయంగానే ఆదాయం పొందింది. గత 15 రోజుల వ్యవధిలో 22,752 శ్రీవాణి దర్శన టికెట్లను కోనుగోలు చేసిన భక్తులు శ్రీవాణి దర్శన టికెట్ల విక్రయం ద్వారా టిటిడి కి రూ. 22.75 కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు. దీంతో వరుసగా 25 వ నెలలో కూడా రూ. 100 కోట్ల మార్క్‎ను దాటింది శ్రీవారి హుండి ఆదాయం. మార్చి నెలలో శ్రీవారికి హుండీ ఆదాయం రూ. 118 కోట్లు వచ్చింది. రోజుకు సగటున దాదాపు 18 గంటలపాటు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండగా నిన్న ఒక్కరోజే 81,224 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా రూ.4.35 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఎన్నికల కోడ్‎తో సర్వదర్శనం చేసుకునే భక్తులకు సంతృప్తికర దర్శనం కలుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..