MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వింత ధోరణి.. ఒకటి కాకపోతే రెండివ్వాలంటున్న అభ్యర్థులు

తమకు ఓటు వేయాలని కోరుతున్న అభ్యర్థులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై కూడా గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పించేందుకు యత్నిస్తున్నారు. తమ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలంటూ ఓటింగ్ విధానాన్ని నమూనా బ్యాలెట్ పేపర్ల సాయంతో వివరిస్తున్నారు. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయాన్ని అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఓటర్లకు వివరిస్తున్నారు.

MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వింత ధోరణి.. ఒకటి కాకపోతే రెండివ్వాలంటున్న అభ్యర్థులు
Follow us

|

Updated on: Mar 10, 2021 | 7:01 PM

Interesting campaign in MLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు రోజులు దగ్గరవడంతో ప్రచార పర్వం ఆసక్తికరంగా మారుతోంది. మార్చి 14న పోలింగ్ జరగనుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు.. బరిలో వున్న ఇండిపెండెంట్లు తమదైన శైలిలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. తమకు ఓటు వేయాలని కోరుతున్న అభ్యర్థులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై కూడా గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పించేందుకు యత్నిస్తున్నారు. తమ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలంటూ ఓటింగ్ విధానాన్ని నమూనా బ్యాలెట్ పేపర్ల సాయంతో వివరిస్తున్నారు. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయాన్ని అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఓటర్లకు వివరిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి పట్టభద్రుల కోటాలో హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, నల్లగొండ-ఖమ్మం -వరంగల్‌ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఎన్. రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిల సభ్యత్వాలు ముగుస్తుండడంతో ఈ రెండు సీట్లకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈ రెండు చోట్ల కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతోపాటు రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అందరి దృష్టిని ఈ ఎన్నికలు ఆకర్షిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మండలిలో ఏ పార్టీ సంఖ్యాబలంలోను పెద్దగా మార్పు రానప్పటికీ.. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

ఎమ్మెల్యే, ఎంపీల ఓటింగుకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో కూడిన బ్యాలెట్ పేపర్లలో ఏ ఒక్కరికో కాకుండా తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతగా ఓటు వేయాల్సి వుంటుంది. పోలయ్యి.. చెల్లుబాటు అయ్యే మొత్తం ఓట్లలో సగానికి పైగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు ఎవరైనా సాధించని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాతనే విజేతను ప్రకటిస్తారు. అంటే మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో యాభై శాతం కంటే కనీసం ఒక ఓటు ఎక్కువ సాధించిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో సంబంధం లేకుండానే గెలుపొందిన వారి పేరును ప్రకటించవచ్చు. కానీ మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో యాభై శాతానికి మించి ఎవరికీ ఓట్లు రాకపోతే అప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోను ఏ ఒక్క అభ్యర్థి ప్రథమ ప్రాధాన్యత ఓట్లు యాభై శాతానికి మించుతాయని ఎవరూ అనుకోవడం లేదు. దాంతో అభ్యర్థులందరు రెండో ప్రాధాన్యత ఓట్లపై కన్నేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లను వీలైనన్ని ఎక్కువ సాధించేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం లేకుంటే… ఓటింగ్‌ సమయంలో కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారు కోరుతున్నారు.

ఆరు సంవత్సరాల క్రితం అంటే 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 96 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదై వుండేవి. అందులో కేవలం 39 శాతం మాత్రమే ఓట్లు నమోదు అయ్యాయి. అంటే లక్షా 13 వేల మంది పట్టభద్రులు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఆనాటి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాద్ బరిలోకి దిగారు. బీజేపీ తరపున అడ్వకేట్ ఎన్. రామచంద్రరావు పోటీచేశారు. కాగా.. వీరిద్దరి ఎన్.రామచంద్రరావు 53 వేల 881 ప్రథమ ప్రాధాన్యత ఓట్లను సాధించి దేవీ ప్రసాద్‌పై గెలిచారు. అయితే ఆరేళ్ళ తర్వాత చూస్తే.. గ్రాడ్యుయేట్స్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో 5 లక్షల 31 వేల మంది గ్రాడ్యుయేట్లకు ఓటు హక్కు వున్నది. టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర రాజకీయ పక్షాలు, ఔత్సాహిక అభ్యర్థులు పట్టభద్రులను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించడంతో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

అదే సమయంలో హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 2015తో పోలిస్తే మూడు రెట్లు అయ్యింది. ఆనాటి ఎన్నికల్లో 31 మంది అభ్యర్థులు బరిలో వుండగా.. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య సరిగ్గా దానికి మూడు రెట్లు అంటే 93కు పెరిగింది. ఓట్లు గణనీయంగా పెరగడం, అభ్యర్థులు మూడింతలవడంతో ఏ ఒక్కరికి ప్రథమ ప్రాధాన్యత ఓట్లలు యాభై శాతానికి మించి రావన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. దాంతో అభ్యర్థులందరు రెండో ప్రాధాన్యత ఓట్లపై కన్నేశారు. ఓటర్లకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పిస్తూ.. కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా తమకు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి 2015లో జరిగిన ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. 2015 ఎన్నికల్లో 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా మొత్తం 2 లక్షల 81 వేల ఓట్లకు గాను లక్షా 49 వేల మంది పట్టభద్రులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 53.25 శాతం పోలింగ్‌ నమోదైనా ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక్క అభ్యర్థికి కూడా పోలయ్యి, చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతం మించి పడలేదు. దాంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య అయిదు లక్షల అయిదు వేలకు పెరిగింది. అభ్యర్థులు దాదాపు నాలుగింతలై 71 మంది బరిలోకి దిగారు. వీరిలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్ రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ, జయసారధి రెడ్డి తదితరులు బరిలో వున్నారు.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కోదండరామ్ రెడ్డి సానుభూతి మంత్రాన్ని నమ్ముకోగా.. పలు మార్లు ఓడిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. దానికి తోడు దుబ్బాకలో బీజేపీ అనూహ్యంగా సాధించిన విజయం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. దానికి తోడు తెలంగాణ బీజేపీ నేతలంతా అగ్రెస్సివ్ స్పీచులతో గ్రాడ్యుయేట్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ఎంతటి ప్రచారం చేసినా కూడా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు ఏ ఒక్కరికీ యాభై శాతానికి మించి రాకపోవచ్చనే అంఛనాలు బలంగా వినిపిస్తుండడంతో అభ్యర్థులంతా రెండో ప్రాధాన్యత ఓట్లను వీలైనన్ని ఎక్కువ రాబట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

ALSO READ: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరం.. మండళ్ళలో నెమ్మదిగా మారుతున్న సమీకరణాలు

ALSO READ: 21ఏళ్ళలో 10మంది ముఖ్యమంత్రులు.. పూర్తి టెర్మ్ వున్న సీఎం ఒక్కరే.. ఇదీ ఉత్తరాఖండ్ హిస్టరీ