కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. నవతరం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతల తీర్మానం

కేంద్రప్రభుత్వం మెడలు వంచైనా విశాఖ ఉక్కుకర్మాగారాన్ని కాపాడుకుంటామని ఈరోజు నరసరావుపేటలోని పల్నాడ్ రోడ్ లో గల నవతరంపార్టీ కార్యాలయంలో..

కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. నవతరం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతల తీర్మానం
Follow us

|

Updated on: Feb 26, 2021 | 4:42 PM

కేంద్రప్రభుత్వం మెడలు వంచైనా విశాఖ ఉక్కుకర్మాగారాన్ని కాపాడుకుంటామని ఈరోజు నరసరావుపేటలోని పల్నాడ్ రోడ్ లో గల నవతరంపార్టీ కార్యాలయంలో నవతరం పార్టీ నరసరావుపేట పార్లమెంట్ కన్వీనర్ డా॥గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా,మహిళా సంఘాల నాయకులు, కౌలు రైతు సంఘం నాయకులు, ప్రజానాట్యమండలి, కెవిపియస్ మరియు జనవిజ్ఞాన వేదిక నాయకులు పాల్గొని తీర్మానించారు.

సమావేశానికి డా॥గోదా రమేష్ కుమార్ సభాధ్యక్షత వహించగా ఈకార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇటువంటి పనికిమాలిన చర్యల వలన లక్షమంది జీవితాలు రోడ్డు మీద పడతాయని విశాఖ ఉక్కు కర్మాగార ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలకు ఉందని అన్నారు.

అనంతరం వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా కార్యదర్శి నార్ల మారుతి బాబు మాట్లాడుతూ కేంద్రం అన్ని వ్యాపార సంస్థలు ప్రైవేటీకరణ చేసి ఉన్నత వ్యాపార వర్గాలవారికి కట్టబెట్టాలని చూస్తుందని ఎవరినో బాగుపరచడం కోసం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటే సహించబోమని తెలిపారు. జన విజ్ఞాన వేదిక నాయకులు బోసుబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వానికి ఒంటెద్దు పోకడ సబబుకాదని విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల బాటలో లేదని కావాలనే కేంద్రప్రభుత్వం అలా ప్రచారం చేసి చీకట్లో ఉన్నత వ్యాపార వర్గాలతో మంతనాలు సాగిస్తుందని ప్రజలంతా బిజేపి చీకటి కుంభకోణాలను గమనిస్తున్నారని తెలిపారు.

కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమ కార్యచరణ చేయడం సంతోషించదగ్గపరిణామమని తెలిపారు.ప్రజా నాట్యమండలి నాయకులు పెద్దిరాజు తన పాట ద్వారా విశాఖ ఉక్కుకర్మాగాన్ని కాపాడేందుకు అందరూ కృషిచేయాలని కోరారు.నవతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.గణేష్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు,కుల,దళిత,మహిళా సంఘాలు ఐక్య ఉద్యమ కార్యచరణ చేపట్టడం శుభపరిణామమని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నుండి కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఉద్యమాలకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

బిసి జెఎసి నాయకులు బత్తుల వెంకటేష్ రాజు మాట్లాడుతూ ఉద్యమం ద్వారా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుండి కాపాడుకోలగమని విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కుల,మత,రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టెముక్కల సుజాత మాట్లాడుతూ విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమ కమిటీ నుండి ఉద్యమిస్తామని తెలిపారు.అనంతరం జనసేన నాయకులు బెల్లంకొండ అనీల్,నాగూల్ మీరా,నవతరంపార్టీ సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ చాట్ల సాగర్, కౌలు రైతు సంఘం నాయకులు కోండ్రు ఆంజనేయులు మరియు వివిధ సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొని అన్ని రాజకీయ పార్టీలు,కుల,దళిత,ప్రజా,మహిళా సంఘాల నాయకులు అందరూ ఐక్య ఉద్యమంచేయాలని తీర్మానించారు.

మరో వైపు ఈరోజు విశాఖ నగరం ఉక్కు నినాదాలతో మార్మోగింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కార్మికులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా దీక్షలు చేపట్టిన ఉద్యమకారులు శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరంలోని అన్ని రోడ్లపై బైఠాయించారు. జాతీయ రహదారిపై గాజువాక, ఇసుకతోట, మద్దిలపాలెం జంక్షన్ వద్ద నిరసనను వ్యక్తం చేశారు. రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు.. నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య పోలీసులకు ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.