Ravindra Jadeja: జామ్నగర్లో వదిన, మరదళ్ల కుస్తీ.. గుజరాత్ ఎన్నికల్లో జడేజాకు భలే చిక్కొచ్చిందిగా..
గుజరాత్ జామ్నగర్ నార్త్ అసెంబ్లీ సీటుకు బీజేపీ, కాంగ్రెస్ పోరాటం కాస్తా వదిన మరదళ్ల పోరాటంలా తయారైంది. బీజేపీ నుంచి టీమిండియా ఆల్రౌండర్ జడేజా భార్య రివాబా పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ తరపు అభ్యర్థి కోసం జడేజా చెల్లెలు నైనా (Naina Jadeja) ప్రచారం చేస్తోంది.
Gujrat Election: గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్.. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోడీ సహా ఆయా పార్టీల అగ్రనేతలంతా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో గుజరాత్ జామ్నగర్ నార్త్ అసెంబ్లీ సీటుకు బీజేపీ, కాంగ్రెస్ పోరాటం కాస్తా వదిన మరదళ్ల పోరాటంలా తయారైంది. బీజేపీ నుంచి టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ తరపు అభ్యర్థి కోసం జడేజా చెల్లెలు నైనా (Naina Jadeja) ప్రచారం చేస్తోంది. దీంతో ఇరువురి మధ్యలో మాటల యుద్దం నడుస్తుంది. నియోజకవర్గంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. సొంత వదినా అని కూడా చూడకుండా.. రివాబా జడేజా (Rivaba Jadeja) పెళ్లయ్యక కూడా ఇంటి పేరు మార్చుకోలేదని నైనా విమర్శల వర్షం కురిపించారు. అలానే వారి చిన్న పిల్లలతో కూడా ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయమై ఎన్నికల అధికారికి కూడా పిర్యాదు చేశారని నైనా జడేజా పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించేలా ఆమె వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానికేతరులకు గట్టిగ బుద్ది చెప్పాలన్నారు నైనా. అయితే నైనాకు ఈ సారి అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించినప్పటికి ఆ టికెట్ మరో వ్యక్తికి కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్ .అయినా పార్టీ ఆదేశాలను పాటిస్తూ, కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి కోసం సొంత అన్నభార్యపైకే విమర్శనాస్త్రాలు సంధిస్తుంది.
గుజరాత్లో ఉన్న 182 శాసన సభ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం