ఆహా.! ఎంత చల్లటి కబురు చెప్పారండీ.. ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఇక వర్షాలే వర్షాలు
మండె ఎండలతో సతమతమవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ కేంద్ర చల్లటి కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు గతంలో కంటే ముందస్తుగానే భారత్ను పలకరించే అవకాశం ఉందని తెలిపింది. ఈ రుతుపవనాల ప్రభావంతో మే చివరి నాటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

ఈ సామి మార్చి మొదటి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, భారత దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండలతో జనాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 43-44 డిగ్రీలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే దేశ ప్రజలకు మరో చల్లని శుభవార్త కూడా చెప్పింది. గతంతో పోల్చుకుంటే ఈసారి నైరుతి రుతువపనాలు ముందే దేశాన్ని చేరుకుంటాయిన తెలిపింది.
ముందుగానే రుతుపవనాలు
యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ అంచనాల ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మే చివరి నాటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మే 18 నుండి 25 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో సాధారణం కంటే 30 నుండి 60 మి.మీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయిని స్పష్టం చేశాయి.
కేరళ తీరాన్ని తాకేది అప్పుడే
ఇక మే 25 నుండి జూన్ 1 మధ్య ఈ రుతుపవనాలు పశ్చిమ దిశగా కదిలి కేరళ తీరాన్ని, తమిళనాడులోని దక్షిణ జిల్లాలను తాకవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్ ఉత్తర ప్రాంతంలో ఒక ఉష్ణమండల వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని.. దీని కారణంగా రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదులుతాయని స్పష్టం చేసింది.
గతేదాడి రుతుపవనాలు ఎప్పుడు వచ్చాయి
గతేడాదిలో కూడా రుతుపవనాలు అంచనా వేసిన దానికంటే ముందే కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైతే, మే 25 నాటికే రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే, ఎండలతో అల్లాడుతున్న కోట్లాది మంది ప్రజలకు ఉపశమనం లభించడమే కాకుండా, వ్యవసాయ పనులు కూడా త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
