Azam Khan: అజం ఖాన్కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట.. ఎన్నికల ప్రచారానికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
UP Polls 2022: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్(Azam Khan)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Assembly Elections 2022) ప్రచారం నిర్వహించేందుకు వీలుగా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ..
UP Polls 2022: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్(Azam Khan)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Assembly Elections 2022) ప్రచారం నిర్వహించేందుకు వీలుగా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ఆయనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అజం ఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అజం ఖాన్ దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టును గత మూడు, నాలుగు నెలల క్రితం నుంచి పలుసార్లు కోరినా ఫలితం లేకపోయిందని తెలిపారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అయితే అజం ఖాన్కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టంచేసిన జడ్జి ఎల్ఎన్ రావు నేతృత్వంలోని బెంచ్.. అజం ఖాన్ దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. భూ ఆక్రమణలు, ఫోర్జరీ తదితర కేసులు ఎదుర్కొంటున్న అజం ఖాన్.. 2020 ఫిబ్రవరి నుంచి జైల్లో ఉంటున్నారు.
యూపీలో బలమైన మైనార్టీ నేతగా అజం ఖాన్కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన రాంపూర్ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. రాంపూర్ ఎమ్మెల్యేగా 9సార్లు ఆయన ఎన్నికయ్యారు. సమాజ్వాది పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అజం ఖాన్.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడు. 2012-2017 మధ్య కాలంలో అధికారంలో ఉన్న సమాజ్వాది పార్టీ ప్రభుత్వంలో అజం ఖాన్ కీలక మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన 80కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. భూ ఆక్రమణలు, ఫోర్జరీ, బెదిరింపులు వంటి పలు అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు.
యూపీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అజం ఖాన్కు బెయిల్ మంజూరుకావడం సమాజ్వాది పార్టీకి ఎదురుదెబ్బగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అజం ఖాన్ ప్రచారం చేస్తే మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్పీకి కలిసి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read..