కొత్త సంవత్సరంలో కొత్త నిబంధనలు… జనవరి 1 నుంచి మారబోతున్న నిబంధనలు మీకు తెలుసా..?
కొత్త సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుంచి నూతనంగా అమలు చేయనున్న నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించింది. అయితే అవి ఏ ఏ నిబంధనలో... ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయో తెలుసుకుందాం...
కొత్త సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుంచి నూతనంగా అమలు చేయనున్న నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించింది. అయితే అవి ఏ ఏ నిబంధనలో… ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయో తెలుసుకుందాం…
ఫాస్టాగ్ విధానంలో….
జనవరి 1, 2021 నుంచి టోల్ ఫీజు చెల్లించే వాహనాలకు కేంద్రం ఫాస్టాగ్ను తప్పని సరి చేస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నిబంధన ప్రకారం డిసెంబర్1, 2017 కంటే ముందు తయారైన అన్ని ఫోర్ వీలర్ వెహికిల్స్కు ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. దీని కోసం కేంద్రం మోటారు వాహన చట్టం 1989లో సవరణలు సైతం చేశారు.
లావాదేవీల విషయంలో…
జనవరి 1, 2021 నుంచి కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రూ.2 వేల పరిమితిని రూ.5 వేలకు పెంచింది. అయితే ఇది పూర్తిగా వినియోగదారు విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే యూజర్ కావాలనుకుంటే ఈ పరిమితిని రూ.5 వేలకు పెంచుకోవచ్చు. లేదంటే రూ.2 వేలకే పరిమితం చేయవచ్చు.
చెక్కుల చెల్లింపులో….
జనవరి 1, 2021 నుంచి చెక్కులకు పాజిటివ్ పే వ్యవస్థను తీసుకురానున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఇందులో భాగంగా రూ.50 వేలకు మించిన చెక్కుల విషయంలో కీలక వివరాలను మరోసారి నిర్ధారించాల్సిన అవసరం రావచ్చు. చెక్కు జారీ చేసే వ్యక్తి చెక్కు నంబర్, తేదీ, పేయీ పేరు, అకౌంట్ నంబర్, అమౌంట్ వంటి వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.
జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ సమయంలో….
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 94 లక్షల మంది చిన్న వ్యాపారస్థులు ఇక సులువగా, మూడు నెలలకు ఓసారి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిటర్న్స్ ఫైల్ చేసే సౌకర్యం కలగనుంది. ఏడాదికి రూ.5 కోట్ల లోపు అమ్మకాలు ఉండే వ్యాపారాలు దీని కిందికి వస్తాయి. ఇప్పటి వరకూ ప్రతి నెల ఒకటి చొప్పున 12 రిటర్న్స్ ఇవ్వాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి మూడు నెలలకోసారి నాలుగు రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుంది.
ల్యాడ్లైన్ నుంచి కాల్ చేయడంలో…
జనవరి 15, 2021 నుంచి ల్యాండ్లైన్ నుంచి మొబైల్ ఫోన్కు కాల్ చేయాలంటే కచ్చితంగా ముందు 0 యాడ్ చేయాల్సిందేనని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) స్పష్టంచేసింది.
ధరల పెరుగుదల….
కొత్త ఏడాదితో పాటు టూ వీలర్, కార్ల ధరలు కూడా కొత్తవి రానున్నాయి. అన్ని తయారీ కంపెనీలు ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నాయి. దేశంలో అతి పెద్ద కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. మోడల్ను బట్టి రేట్లు పెంచనుంది. ఇండియాలో తమ కార్ల ధరలు పెంచనున్నట్లు ఇప్పటికే ఎంజీ మోటార్స్ ప్రకటించింది. జనవరి నుంచి రెనాల్ట్ కార్ల ధరలు రూ. 28 వేల వరకు పెరగనున్నాయి. ఇక టూవీలర్లలో హీరో మోటోకార్ప్ తమ వాహనాల ధరలు రూ.1500 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.