చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం అయిన సంగతి తెలిసిందే. అక్కడ 14 రోజుల పాటు చంద్రునిపై ప్రయాణించిన రోవర్.. చంద్రునిపై చీకటి రావడంతో మరో 14 రోజుల పాటు ల్యాండర్, రోవర్లు స్లీప్ మోడ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు చందమామపై ఇప్పుడు సూర్యోదయం అయినట్లు ఇస్రో చెబుతోంది. అయితే ఆ సమయం కోసమే ఇప్పటిదాకా ఎదురుచూసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. మిషన్ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై వాలిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఇప్పుడు ఎలా ఉండబోతోందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్న ఈ రెండూ కూడా మేల్కొంటే గానీ.. చంద్రుడిపై మళ్లీ పరిశోధనలు చేయడం సాధ్యం కాదు.
అయితే మరి ఈ ల్యాండర్, రోవర్లు శాశ్వత నిద్రలోకి వెళ్తాయా? లేక.. పునరుజ్జీవం పొందుతాయా? అనే విషయం తొందర్లోనే మరికొద్ది గంటల్లోనే తెలియనుంది. ఇదిలా ఉండగా.. చంద్రుడిపై ఇస్రో చేపట్టిన పరిశోధనలు 14 రోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైన తరువాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను.. ఇస్రో శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్లో పెట్టారు. వాస్తవానికి చంద్రునిపై ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం. ఈ నెల 22వ తేదీన రాత్రి సమయం ముగుస్తుంది. ఆ తర్వాత పగలు ఆరంభం కానుంది. దీంతో మళ్లీ 14 రోజుల పాటు చంద్రునిపై పగటి సమయం ఉంటుంది. అయితే సూర్య కిరణాలతో విక్రమ్ ల్యాండర్, రోవర్లో అమర్చినటువంటి బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు బ్యాటరీలు కూడా సౌర విద్యుత్ ఆధారంగా పని చేస్తాయి. రాత్రి కావడంతో ప్రస్తుతం బ్యాటరీలు డెడ్ అయ్యాయి.
అయితే అవి మళ్లీ రీఛార్జ్ కావాలంటే సౌర విద్యుత్ కావాల్సిందే. పగటి సమయం రానున్నందున సూర్యుడి వెలుగు వల్ల మళ్లీ బ్యాటరీలు రీఛార్జ్ అవుతాయని ఇస్రో భావిస్తోంది. అవి విజయవంతంగా రీఛార్జ్ అయితే రోవర్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మరో 14 రోజుల పాటు కూడా చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి వీలు ఉంటుంది. ఇదిలా ఉంటే.. చందమామ దక్షిణ ధృవంపై మైనస్ 250 డిగ్రీల వరకు చలి ఉంటుందని.. అయితే దీన్ని తట్టుకునే సామర్థ్యం చంద్రయాన్ 3 పేలోడ్స్కు లేవని ఇస్రో శాస్త్రవేత్త సువేందు పట్నాయక్ పేర్కొన్నారు. 14 రోజుల పాటు ఉన్న గడ్డ కట్టిన చలి ప్రభావం వల్ల కొన్ని ఎలక్ట్రానిక్ భాగాలు పనిచేయడం కష్టమని తెలిపారు. రాత్రి సమయం ముగిశాక పేలోడ్స్ మళ్లీ రీయాక్టివేట్ అవుతాయని ఆశించట్లేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ మళ్లీ పని చేయడం మొదలుపెడితే అది తమకు అనుకోని వరమవుతుందని పేర్కొన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..