Petro Prices Hike: పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి.. పోటీ..! పన్ను పోటులో కేంద్రానికేం తీసిపోని రాష్ట్రాలివే

పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి అన్నట్లు వ్యవహరిస్తున్నాయి కేంద్ర, రాష్ట్రాలు. కేంద్రం మోపుతున్న పన్నులో వాటా పొందుతున్న రాష్ట్రాలు అది చాలదన్నట్లు వ్యాట్‌రూపంలోను, సెస్‌ పేరుతోను వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఇంతకీ ఏ రాష్ట్రం ఏ మేరకు పన్నుభారం మోపుతోంది?

Petro Prices Hike: పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి.. పోటీ..! పన్ను పోటులో కేంద్రానికేం తీసిపోని రాష్ట్రాలివే
Follow us

|

Updated on: Feb 23, 2021 | 4:35 PM

States are in race with Union Government on Petro taxes: పెట్రో బాదుడు దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రోజూ వారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు అందరిలోను ఆందోళన రేపుతున్నాయి. అయితే, ఈ పరిణామం జాతీయ స్థాయిలో వుండడంతో సహజంగానే కేంద్ర ప్రభుత్వంపైనే ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. అలా అవ్వాలి కూడా. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్రమే కాబట్టి. కానీ పెట్రో బాదుడులో కేంద్రానిదే బాధ్యతా? అంటే కాదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధర ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఖరారు చేస్తే.. రవాణా ఛార్జీలు, డీలర్ మార్జిన్‌లను కలుపుకున్నా కూడా లీటర్ 30 నుంచి 40 రూపాయల మధ్య ప్రజలకు లభించాలి. అలా జరక్క పోవడానికి కారణం అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌లపై ఎడాపెడా పన్నులు, సెస్‌ల భారమే కారణం. ఇంతకీ కేంద్రం పన్ను ఎంత? రాష్ట్రాలు వేస్తున్న అదనపు పన్ను, సెస్‌ల భారమెంత? ఓ సారి తెలుసుకుందాం.

ఇటీవల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ వారీగా పోటీ పడుతూ పెరుగుతున్నాయి. నిజానికి క్రూడ్ ఆయిల్ ధరతో భాగిస్తే లీటర్ ధర రూ.22.16గా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 48 అమెరికన్ డాలర్లు. దానిని భారత కరెన్సీలోకి మారిస్తే రూ. 3,525. ఒక బ్యారెల్ క్రూడ్ అంటే 159 లీటర్లు. ఒక లీటరు క్రూడ్ ఆయిల్‌కు పడుతున్న ధర రూ.22.16. దానికి శుద్ది చేయడం, రవాణా, డీలర్ మార్జిన్లు అదనం. అయితే కేంద్రం విధిస్తున్న పన్ను లీటర్‌కు 32 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, రోడ్డు సెస్‌ల పేరుతో వేస్తున్న భారం లీటర్ పెట్రోల్‌కు రూ.32.98 డీజిల్‌కు 31.83 రూపాయలు. కేంద్ర విధిస్తున్న సుంకంతోనే పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అవుతుంటే.. రాష్ట్రాలు కూడా పన్నులు, సెస్‌ల విధింపులో కేంద్రంతో పోటీ పడుతున్నాయి.

రాష్ట్రాలు విధించే పన్ను ఇలా వున్నాయి…

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై మహానగరంతోపాటు దాని శివారులో వుండే థానే, నవీ ముంబైలలో 26 శాతం వ్యాట్‌తో పాటు అదనపు పన్ను రూపంలో రూ.10.12 విధిస్తోంది. మిగతా మహారాష్ట్ర ప్రాంతంలో 25 శాతం వ్యాట్‌‌కు అదనంగా రూ.10.12 పన్ను విధిస్తూ లీటర్ మీద రూ. 26.22 ప్రజలపై భారం మోపుతోంది మహా ప్రభుత్వం. ఇక మధ్య ప్రదేశ్ విషయానికి వస్తే 33 శాతం వ్యాట్‌కు లీటర్‌కు నాలుగున్నర రూపాయలు (ఒక రూపాయి సెస్ పేరిట) కలిపి మొత్తం లీటర్‌కు అదనంగా రూ. 25.96 భారం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. ఆంధప్రదేశ్ విషయానికి వస్తే ఈ బాదుడు తక్కువేం లేదు. 31 శాతం వ్యాట్‌కు లీటర్‌కు నాలుగు రు రూపాయలు (ఒక రూపాయి సెస్ రోడ్డు డెవలప్‌మెంటు పేరిట) కలిపి లీటర్‌కు రూ. 24.96 రూపాయల భారం మోపుతున్నారు. మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రాలు కూడా అతి ఎక్కువ స్థాయిలో వ్యాట్ విధిస్తున్నాయి. అక్కడ 36.5 శాతం వ్యాట్ పేరిట లీటర్ 25 రూపాయల భారం మోపుతున్నారు. అయితే అక్కడ అదనపు సెస్ ‌లేకపోవడం గుడ్డిలో మెల్ల.

రాజస్థాన్‌లో 36 శాతం వ్యాట్ ప్రతీ వేయి లీటర్లకు రూ. 1500 రోడ్డు డెవలప్ మెంటు సెస్ కలిపి లీటర్‌కు అదనంగా రూ. 24. 68, తమిళనాడులో 15 శాతం వ్యాట్‌కు లీటర్ రూ.13.02 అదనపు పన్నుతో కలిపి రూ. 22.68, తెలంగాణలో 35.2 శాతం వ్యాట్ కలిపి రూ. 22. 67, కర్నాటకలో 35 శాతం అమ్మకపు పన్ను పేరిట లీటర్‌కు రూ.22.54. ఒడిషా 32 శాతం వ్యాట్‌తో రూ.20.60, కేరళ 24 శాతం ఎంఎస్టీతోపాటు లీటర్‌కు ఎంప్లాయిమెంటు సెస్ రిడక్షన్ కలుపుకుని రూ. 5 వేసుకుని మొత్తమ్మీద లీటర్‌కు రూ.20.56 అదనంగా వినియోగదారులపై భారం మోపుతున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 30 శాతం వ్యాట్‌తో కలిపి లీటర్‌కు రూ.19.32, చత్తీస్ గఢ్‌లో 25 శాతం వ్యాట్‌తోపాటు లీటర్ రెండు రూపాయల అదనపు పన్ను కలిపి రూ.18.10, ఉత్తర్ ప్రదేశ్ 26.80 శాతం పన్ను లేదా రూ.18.74 అదనపు పన్ను ఏది ఎక్కువైతే అది కలిపి లీటర్‌కు రూ.17.26 అదనంగా వసూలు చేస్తున్నారు. నాగాల్యాండ్‌లో 29.80 శాతం వ్యాట్ లేదా రూ.18.26లలో ఏది ఎక్కువైతే ఆ మొత్తానికి రూ.5 సర్‌ఛార్జీ, రూ.2 రోడ్డు మెయింటేనెన్స్ సెస్ కలిపి మొత్తమ్మీద లీటర్‌కు 22.15 భారం మోపుతున్నారు. అస్సోంలో 32.66 శాతం వ్యాట్ లేదా రూ.22.63 ల పన్ను ఏది ఎక్కువైతే దానిని కలిపి లీటర్‌కు రూ.21.03ల భారం వేస్తున్నారు.

జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో 24 శాతం ఎంఎస్‌టీకి రూ.5 (లీటర్‌కు ఎంప్లాయిమెంట్‌ సెస్‌ లీటర్‌ కు రూ.0.50 రిడక్షన్‌) కలిపి లీటర్‌కు రూ.19.95లు అదనంగా వసూలు చేస్తున్నారు. పంజాబ్‌లో పెట్రో బాదుడు వెరైటీగాను, సంక్లిష్టంగాను వుంది. ప్రతీ వేయి లీటర్లకు రూ.2050 సెస్, అర్బన్ ట్రాన్స్ పోర్టు ఫండ్ పేరిట లీటర్‌కు 10 పైసలు, 24.79 శాతం వ్యాట్ వీటన్నింటికి అదనంగా 10 శాతం వ్యాట్‌పై అదనపు సెస్ అన్నీ కలిపి ప్రతీ లీటర్ రూ. 18.27 అదనంగా వసూలు చేస్తోంది పంజాబ్ ప్రభుత్వం. జార్ఖండ్ 22 శాతం అమ్మకపు పన్ను లేదా లీటర్‌కు 17 రూపాయలు టాక్స్ ఏది ఎక్కువైతే దానికి ఒక రూపాయి అదనపు సెస్ కలిపి మొత్తమ్మీద లీటర్‌కు రూ.18 వసూలు చేస్తున్నారు. బెంగాల్ ప్రభుత్వం 25 శాతం వ్యాట్ లేదా లీటర్‌కు రూ.13.12 పన్ను ఏది ఎక్కువుంటే దానికి ప్రతీ వేయి లీటర్లకు వేయి రూపాయలు అదనపు సెస్సు విధిస్తున్నారు. అయితే ఇందులో 17 రూపాయలను ప్రభుత్వం మినహాయింపునిస్తోంది. లద్దాఖ్‌లో 24 శాతం ఎంఎస్టీకి అయిదు రూపాయలను ఎంప్లాయిమెంట్ సెస్ రిడక్షన్ రెండున్నర రూపాయలు కలిపి లీటర్‌కు రూ.17.95 వసూలు చేస్తున్నారు. హర్యానాలో 25 శాతం వ్యాట్ లేదా లీటర్‌కు రూ.15.62 ఏది ఎక్కువైతే దానికి 5 శాతం వ్యాట్‌పై అదనపు పన్ను విధించి లీటర్ మీద రూ.16.90 వసూలు చేస్తున్నారు.

బీహార్‌‌లో 26 శాతం వ్యాట్ లేదా రూ.16.65 లీటర్‌కి ఏది ఎక్కువగా ఉంటే దానికి 30 శాతం సర్ చార్జీ కలిపి లీటర్‌కు రూ.16.74, త్రిపురలో 25 శాతం వ్యాట్‌‌కు 3 శాతం త్రిపుర రోడ్డు డెవలప్‌ మెంట్‌ సెస్‌ కలిపి రూ. 16.58, గోవాలో 25 శాతం వ్యాట్‌కు 0.5 శాతం గ్రీన్‌ సెస్‌ కలిపి లీటర్‌కు రూ.16.18, హిమాచల్‌ ప్రదేశ్‌‌లో 25 శాతం వ్యాట్ లేదా లీటర్‌కు రూ.15.50 ఏది ఎక్కువగా ఉంటే అది కలిపి లీటర్‌కు రూ.16.10, ఉత్తరాఖండ్‌‌లో 25 శాతం వ్యాట్ లేదా రూ.19 లీటర్‌‌కు ఏది ఎక్కువగా ఉంటే అది కలిపి లీటర్‌కు రూ.16.10, ఛండీగఢ్‌‌లో రూ.10 (వేయి లీటర్లకు+22.45శాతం) లేదా లీటర్‌కు రూ.12.58 ఏది ఎక్కువగా ఉంటే అది కలిపి లీటర్‌కు రూ.15.46 రాష్ట్ర ఖజానా కోసం వసూలు చేస్తున్నారు.

తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు పెట్రో భారంలో కేంద్రానికి ఏ స్థాయిలో బాదుడు వుంటే.. అదే స్థాయిలో రాష్ట్రాలు వినియోగదారులపై భారం మోపుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గించైనా కొద్ది మేరకు వినియోగదారులపై భారం తగ్గిద్దామన్న ఆలోచన ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గితే అభివృద్ధి కుంటుపడుతుందన్న కామెంట్లతో నెట్టుకొస్తున్నారు పాలకులు. నిజానికి పాలకుల హంగు ఆర్భాటాలకు అయ్యే ఖర్చును మినహాయించినా ప్రజల నెత్తిన పడుతున్న పెట్రో భారాన్ని కొద్ది మేరకైనా తగ్గించవచ్చు. ఆ దిశగా ఆలోచన చేసే పాలకులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ALSO READ: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!