ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన కొడుకులు.. కారణం తెలిస్తే..
గణేషన్ పాము కాటుతో చనిపోయాడు. అతని పేరు మీద బీమా పాలసీలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు విచారణకు వెళ్లారు. అయితే కుటుంబసభ్యులు చెప్పిన సమాధానాలపై ప్రతినిధులకు డౌట్ వచ్చింది. వెంటనే పోలీసులకు చెప్పడంతో వారు రంగంలోరి దిగారు. ఈ క్రమంలో కొడుకులు చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

కలికాలం పరాకాష్టకు చేరింది. ఆస్తి కోసం, డబ్బు కోసం రక్త సంబంధాలను కూడా మర్చిపోయి మనుషులు మృగాల్లా మారుతున్నారు. బీమా డబ్బు, ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఇద్దరు కొడుకులు కన్నతండ్రిని పాముతో కరిపించి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వెలుగుచూసింది. పోతత్తూర్పేట ప్రాంతానికి చెందిన గణేషన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసేవారు. అక్టోబర్ 22న ఆయన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురై మరణించారని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దీనిని సాధారణ మరణంగా భావించి కేసు నమోదు చేశారు.
బీమా కంపెనీ తనిఖీలో బయటపడ్డ నిజం
గణేషన్ పేరు మీద సుమారు రూ.3 కోట్ల విలువైన బీమా పాలసీలు ఉన్నాయి. ఆయన మరణానంతరం ఆ డబ్బు కోసం కుటుంబ సభ్యులు బీమా కంపెనీని ఆశ్రయించారు. అయితే విచారణకు వచ్చిన అధికారులకు కుటుంబ సభ్యులు చెప్పిన సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐజీ అస్రా గార్గ్ పర్యవేక్షణలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
హత్యకు స్కెచ్.. పాముతో కాటు
గణేషన్ కుమారులు మోహన్రాజ్, హరిహరన్ తమ తండ్రి చనిపోతే ఆయన ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.3 కోట్ల బీమా సొమ్ము వస్తుందని ఆశపడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారు ఒక భయంకరమైన ప్లాన్ వేశారు. పాములు పట్టే వ్యక్తి వద్ద నుంచి అత్యంత విషపూరితమైన పామును కొనుగోలు చేశారు. అక్టోబర్ 21న రాత్రి తండ్రి నిద్రిస్తున్న సమయంలో తమ స్నేహితులతో కలిసి ఆ పామును తండ్రి మెడపై వదిలారు. అది ఆయనను కరిచేలా చేసి తండ్రి ప్రాణాలు కోల్పోయాక పాము కాటుతో చనిపోయినట్లు నాటకమాడారు.
ముగ్గురు స్నేహితులతో కలిసి కుట్ర
ఈ దారుణంలో కుమారులతో పాటు వారి స్నేహితులు బాలాజీ, ప్రశాంత్, నవీన్ కుమార్, దినకరన్ కూడా సహకరించినట్లు తేలింది. తండ్రిని చంపినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. దీంతో పోలీసులు గణేషన్ ఇద్దరు కుమారులు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కష్టపడి పెంచి, ప్రయోజకులను చేసిన తండ్రిని డబ్బు కోసం ఇలా పాముతో కరిపించి చంపడం చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








