Asaduddin Owaisi: సమాజ్‌వాది పార్టీకి ఆ సత్తా లేదు.. మైనార్టీలు ఓటు వేయొద్దంటూ MIM చీఫ్ అసద్ ఘాటు వ్యాఖ్యలు

యూపీలో బలపడేందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అంటూ సామజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి.

Asaduddin Owaisi: సమాజ్‌వాది పార్టీకి ఆ సత్తా లేదు.. మైనార్టీలు ఓటు వేయొద్దంటూ MIM చీఫ్ అసద్ ఘాటు వ్యాఖ్యలు
AIMIM chief Asaduddin Owaisi (File Photo)
Follow us

|

Updated on: Jun 27, 2022 | 10:21 AM

యూపీలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ(SP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజంగఢ్, రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని అధికార బీజేపీ కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో వీటికి ఉప ఎన్నికలు అనివార్యమైయ్యాయి. సమాజ్‌వాది పార్టీ చేతిలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేశారు. యూపీలో అధికార బీజేపీని ఓడించే సత్తా సమాజ్‌వాది పార్టీకి లేదని.. ఈ విషయం ఉప ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు. అయితే ఈ విషయంలో తన బలంపై సమాజ్‌వాది పార్టీకి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు.

మైనార్టీలు అలాంటి అసమర్థ పార్టీలకు ఓటు వేయకూడదని అసద్ పిలుపునిచ్చారు. యూపీలోని రెండు లోక్‌సభ నియోజవర్గాలను బీజేపీ గెలుచుకుందని.. దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీకి B టీమ్, C టీమ్ అంటూ ఎవరిని నిందిస్తారని సమాజ్‌వాది పార్టీని ప్రశ్నించారు.

యూపీలో బలపడేందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అంటూ సామజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. మైనార్టీ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఎంఐఎం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఈ ఆరోపణలను అసద్ పలు సందర్భాల్లో తోసిపుచ్చారు.

ఇవి కూడా చదవండి

2019నాటి లోక్‌సభ ఎన్నికల్లో అజంగఢ్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ 2.5 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఇప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై 8 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే రాంపూర్ నియోజకవర్గంలో 2004, 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ విజయం సాధించింది. ఎస్పీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి మొహమ్మద్ అసీం రజాపై బీజేపీ అభ్యర్థి గన్‌శ్యామ్ సింగ్ లోధి 40 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఈ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తంచేశారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు చారిత్రకమైనవిగా అభివర్ణించిన వారు.. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ప్రజలు ఈ ఫలితాల ద్వారా తమ ఆమోదాన్ని తెలియజేశారని సంతోషం వ్యక్తంచేశారు. పార్టీ కార్యకర్తలను అభినందించారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి