15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్.. గతేడాది మార్చిలో..
సామూహిక అత్యాచారం కేసులో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది మార్చిలో ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు కాగా.. పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

సామూహిక అత్యాచారం కేసులో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది మార్చిలో ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు కాగా.. పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోహరి లాల్ మీనా తనయుడు దీపక్ అలియాస్ దీపక్ మీనాను సామూహిక అత్యాచారం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి గత ఏడాది మార్చిలో మాండవర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేసి ఎమ్మెల్యే తనయుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసినందుకు దీపక్ సహా మరో నలుగురిపై పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అత్యాచార బాధితురాలు రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక అని పోలీసులు తెలిపారు.
ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఇతర నిందితులు వివేక్ శర్మ, నేత్రం సమలేటిని ఇంతకు ముందే పోలీసులు అరెస్టు చేశారు. అయితే, దీపక్ ముందస్తు బెయిల్ పిటిషన్ను పోక్సో కోర్టు, హైకోర్టు ఇప్పటికే తిరస్కరించి అరెస్ట్ వారెంట్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో నిందితులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) దాఖలు చేశారు.
నివేదికల ప్రకారం, జనవరి 23 లోపు దీపక్ను అరెస్టు చేయాలని దౌసా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జోహారీ లాలా రాజ్గఢ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. అతని కొడుకు దీపక్ అరెస్ట్ తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పై విరుచుకుపడింది.




నిందితులను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన ప్రభుత్వం కాపాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా ఆరోపించారు. బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ కూడా అధికార రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




