Presidential poll: శుక్రవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్.. అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతు
NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఢిల్లీ చేరుకున్న ఆమె ప్రధాని మోదీని కలిశారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉందని ట్విటర్లో ప్రశంసించారు. NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఆమెను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, వీరేంద్ర కుమార్, బీజేపీ నేత మనోజ్ తివారీ రిసీవ్ చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు విమానాశ్రయం వద్దకు వచ్చి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ఆమె కలిశారు.
#WATCH | Delhi: NDA’s Presidential candidate Droupadi Murmu met BJP president JP Nadda, earlier today pic.twitter.com/w0ckbQ5c9N
— ANI (@ANI) June 23, 2022
వివిధ పార్టీల నాయకులను కూడా ఆమె మద్దతు కోరనున్నారు. ఇవాళ ఆమె నామినేషన్ దాఖలు చేస్తారు. 1958లో జన్మించిన ద్రౌపది ముర్ము గిరిజన సమాజానికి చెందిన నాయకురాలు. సొంత రాష్ట్రం ఒడిశా. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే భాతర తొలి గిరిజన రాష్ట్రపతిగా చరిత్రకెక్కుతారు.
జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన తొలి గిరిజన మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు. నవీన్ పట్నాయక్ బీజేపీ మద్దతుతో ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో రాష్ట్ర కేబినేట్ మంత్రిగా కూడా ముర్ము పనిచేశారు. ఒడిశా నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంతో నవీన్ పట్నాయక్ సైతం ముర్ము అభ్యర్థిత్వానికే మద్దతు ఇస్తున్నారు.
శుక్రవారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, 21న కౌంటింగ్ జరుగుతుంది.