Atal Bihari Vajpayee: నేడు మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి.. ప్రధాని మోడీ సహా పలువురు ఘన నివాళులు..
Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతి సందర్భంగా యావత్ భారతం ఆయన్ని స్మరించుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వాజ్పేయి కి..
Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతి సందర్భంగా యావత్ భారతం ఆయన్ని స్మరించుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వాజ్పేయి కి నివాళులర్పించారు. భారతదేశాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి అటల్ బిహారీ వాయిపేయి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ మనందరికీ స్ఫూర్తిదాయకం. వాజ్ పేయి చేసిన అభివృద్ధి పనులను లక్షలాది మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేశాయని అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ లో వాజ్పేయి కి నివాళులర్పించారు. భరతమాత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న అటల్ జీ తిరుగులేని సూత్రాలతో దేశంలో సుపరిపాలన అందించారని గుర్తు చేసుకున్నారు. వాజ్ పేయి తన దృక్పథాన్ని సాకారం చేయడం ద్వారా భారత రాజకీయాలకు కొత్త మార్గాన్ని అందించారని తెలిపారు. అద్వితీయ దేశభక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళుర్పించారు. ప్రధానిగా అటల్ దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు.. నేడు బలమైన భారతదేశానికి పునాదిఅని చెప్పారు. వాజ్ పేయి చేసిన సేవలను స్మరించుకుంటూ మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ‘సుపరిపాలన దినోత్సవాన్ని’ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. అందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలని చెప్పారు.
10 సార్లు లోక్సభకు ఎన్నికైన వాజ్పేయి:
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని విజయ శిఖరాలకు చేర్చడంలో వాజ్పేయి పాత్ర చాలా ముఖ్యమైనది. 1990వ దశకంలో, వాజ్ పేయి బీజేపీ ముఖ్యమైన వ్యక్తిగా మారారు. 1996లో కేంద్రంలో మొదటిసారిగా.. బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. అయితే, 1998లో అటల్ మళ్లీ ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యారు. అనంతరం 1999 నుంచి 2004 వరకు మూడోసారి భారత ప్రధానిగా ఉన్నారు.
వాజ్ పేయి అనగానే 1998లో పోఖ్రాన్ అణుపరీక్ష, 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం ప్రతి భారతీయుడి మదికి గుర్తుకొస్తాయి. అయితే ప్రధాని వాజ్ పేయి హయాంలోనే 2001 డిసెంబర్లో పార్లమెంటు భవనంపై దాడి జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీస్ ఫిబ్రవరి 1999లో ప్రారంభించబడింది. ఇది భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఒక చారిత్రాత్మక చర్య అంటూ ప్రశంసలు అందుకుంది.
వాజ్ పేయి 1957లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ నుంచి జనసంఘ్ టిక్కెట్పై గెలిచి లోక్సభకు చేరుకున్నారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి వివిధ ప్రాంతాల (గ్వాలియర్, న్యూఢిల్లీ, లక్నో) నుంచి 10 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.
ఐక్యరాజ్యసమితిలో తొలిసారిగా హిందీలో ప్రసంగం
ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ భాయ్ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజ్ పేయి పనిచేశారు. ఆ సమయంలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో హిందీ భాషలో ప్రసంగించిన మొదటి నాయకుడు వాజ్పేయి. అప్పటి వరకూ ఈ ప్రపంచ వేదికపై ఎవరూ హిందీలో ప్రసంగం చేయలేదు. వాజ్పేయిని భారత ప్రభుత్వం మార్చి 27, 2015న దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించింది.
వాజ్పేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్లోని షిండే కా బడా ప్రాంతంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణ బిహారీ వాజ్పేయి, కృష్ణ బాజ్పేయి. అటల్ తండ్రి ఉపాధ్యాయుడు. అటల్ బిహారీకి ముగ్గురు అన్నలు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. బడాలో 8వ తరగతి వరకు చదివిన అటల్ గ్వాలియర్లోని విక్టోరియా కాలేజీ నుంచి డిగ్రీ పట్టాను పుచ్చుకున్నారు. కాన్పూర్లోని DAV కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పట్టా తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటూ 16 ఆగస్టు 2018న వాజ్పేయి మరణించారు.