Population Control Law: జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..
Population Control Law: దేశంలో రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్న జనాభా అనేక సమస్యలకు కారణం అవుతోంది. అధిక జనాభా కారణంగా..
Population Control Law: దేశంలో రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్న జనాభా అనేక సమస్యలకు కారణం అవుతోంది. అధిక జనాభా కారణంగా.. దేశంలో రానున్న కాలంలో సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కేంద్ర మంత్రే జనాభా నియంత్రణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దేశంలో త్వరలో జనాభా నియంత్రణ చట్టం తేబోతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’లో పాల్గొనటానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన ఆయన.. దేశంలో జనాభా నియంత్రణ కోసం త్వరలోనే ప్రత్యేక చట్టం తీసుకువస్తామని అన్నారు. దీని విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ‘జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే తీసుకువస్తాం. ఆందోళన వద్దు. అటువంటి బలమైన, పెద్ద నిర్ణయాలు తీసుకున్నపుడు మిగతావి కూడా నెరవేర్చటం జరుగతుంది’’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
కాగా, దేశంలో జనాభా నియంత్రణ కోసం ఉద్దేశించిన ఒక ముసాయిదా బిల్లును 2019లో ఎంపీ రకేశ్ సిన్హా నామినేట్ చేయటంతో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని నెలలకు శివసేన ఎంపీ అనిల్ దేశాయ్.. ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రతిపాదిస్తూ రాజ్యాంగ (సవరణ) బిల్లు 20202ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ అంశం ఇప్పటికీ పార్లమెంట్ పరిధిలోనే ఉండిపోయింది. తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు.. మరోసారి జనాభా నియంత్రణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చాయి.