AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల వేళ కీలక నిర్ణయం.. యోగి, అఖిలేష్, మాయావతికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు!

ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు మొత్తం 52 మంది ప్రముఖ రాజకీయ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు తెలుస్తోంది. ఒక్కో జాకెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.

ఎన్నికల వేళ కీలక నిర్ణయం.. యోగి, అఖిలేష్, మాయావతికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు!
Cm Yogi, Akhilesh, And Mayawati
Balaraju Goud
|

Updated on: Aug 22, 2026 | 4:09 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు మొత్తం 52 మంది ప్రముఖ రాజకీయ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు తెలుస్తోంది. ఒక్కో జాకెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.

ఈ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 11 మంది మంత్రులు కూడా ఉన్నారు. వారిలో సంజయ్ నిషాద్, నంద్ గోపాల్ గుప్తా నంది, ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్‌కు కూడా బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ అందించినట్లు సమాచారం. మొత్తం 52 మందికి రెండు దశల్లో ఈ జాకెట్లను పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదటి దశలో ఎనిమిది మందికి, రెండో దశలో మరో 44 మందికి జాకెట్లు అందించినట్లు పేర్కొన్నాయి.

ఇదే సమయంలో పలువురు ఇతర రాజకీయ నాయకులకు కూడా భద్రతను పెంచినట్లు సమాచారం. బీజేపీ నేతలు స్వతంత్ర దేవ్ సింగ్, జైవీర్ సింగ్, మహేంద్ర సింగ్ తదితరులకు భద్రతా ఏర్పాట్లు విస్తరించినట్లు వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లో 98 మంది నాయకులు, ప్రముఖులకు వారి భద్రతా అవసరాలకు అనుగుణంగా వివిధ కేటగిరీల భద్రత కల్పించనున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగం పేర్కొంది.

ఎన్నికల కోసం బీజేపీ భారీ కసరత్తు

ఇదిలవుంటే, 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపడుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది. జగదీష్ ఈశ్వర్‌భాయ్ పటేల్‌ను సహ ఇన్‌చార్జ్‌గా నియమించింది. కీలకమైన యూపీ ఎన్నికల కోసం అనుభవజ్ఞులైన నాయకత్వాన్ని రంగంలోకి దింపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో సామాజిక, కుల సమీకరణాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులకు సంస్థాగత పదవుల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా పార్టీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, అభ్యర్థులు, స్థానిక సమస్యలపై సర్వేలు ప్రారంభించినట్లు సమాచారం. 2027 ఎన్నికల్లో కీలకంగా మారే అంశాలను ముందుగానే గుర్తించి వ్యూహాలు సిద్ధం చేసేందుకు ఈ సర్వేలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. యూపీలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సన్నాహాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us