Tractor Rally Violence: పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు… సున్నిత అంశాలపై కేంద్రం స్పందిస్తుందని వ్యాఖ్య…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో హింస చోటు...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో హింస చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. సున్నితమైన అంశంలో కేంద్రం చట్టపరంగా స్పందిస్తుందని తెలిపింది. పిటిషన్లను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సీజేఐ సూచించింది.
కమిషన్ ఏర్పాటు చేయాలని…
మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులు జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అయితే వేల మంది ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు. ఎర్రకోటలో మత జెండాను ఎగురవేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది విశాల్ తివారి వేసిన పిటిషన్ కూడా వీటిలో ఉంది.
ఓటింగ్ సరిగ్గా జరగలేదని…
మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేయకుండా అధికారులు, మీడియాకు ఆదేశాలివ్వాలని మనోహర్ లాల్ శర్మ అనే మరో న్యాయవాది పిటిషన్ వేశారు. అంతేకాకుండా రాజ్యసభలో సాగు చట్టాలపై సరైన పద్ధతిలో ఓటింగ్ జరగలేదని మరో పిటిషన్ సైతం వేశాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో అప్లికేషన్ దాఖలు చేయాలని కోరింది. మరికొందరు ఎర్రకోటపై వేరే జెండా ఎగరవేయడంపై, దాని బాధ్యులపైన కేసులు నమోదు చేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read: