ఒక వైపు ఇండియా, మరో వైపు బలుచిస్తాన్.. పాపం పాకిస్థాన్! వాయించి వదిలిపెడుతున్నారుగా..
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తరువాత, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేసింది. బోలాన్, కెచ్ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 14 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. BLA రిమోట్ కంట్రోల్డ్ IED లను ఉపయోగించి ఈ దాడులు చేసింది.

ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్ను ఇండియా చావు దెబ్బకొట్టింది. ఊహించని ఈ దాడితో ఇప్పటికే పాకిస్థాన్ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే గాయంపై కారు చల్లినట్లు, మూలిగే నక్కపై తాటిగాయ పడ్డట్టు.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్కు పక్కలో బల్లెంలా మారింది. గురువారం బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బోలాన్, కెచ్ ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహించింది. ఈ దాడిలో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. మొదటి దాడిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (STOS) బోలాన్లోని మాచ్లోని షోర్కాండ్ ప్రాంతంలో పాక్ సైనిక కాన్వాయ్పై రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) దాడి చేసింది.
శక్తివంతమైన పేలుళ్లలో వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది సైనికులు మరణించారు. వీరిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ ఉన్నారు. ఈ పేలుడులో సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. రెండవ సంఘటనలో బలూచ్ కార్యకర్తలు కెచ్లోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను లక్ష్యంగా చేసుకున్నారు. మధ్యాహ్నం 2:40 గంటలకు రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
బలూచిస్తాన్లో పాక్ సైన్యంపై దాడులు
కాగా పాకిస్థాన్లోని ఒక ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్లో కొంతమంది వేర్పాటు వాదులు ఎప్పటి నుంచో బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు. కానీ, పాకిస్థాన్ ఎప్పటికప్పుడు వారిని అణచివేస్తూ వస్తోంది. అయితే.. ఇప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ.. ఇండియాలో దాడులకు పాల్పడుతోంది. ఇటీవలె పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది మరణించారు. దీంతో ఈ దాడిని సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వం పాక్పై ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించి.. తాజాగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చింది.
ఈ దాడితో పాకిస్థాన్ అతలాకుతలమైంది. పాకిస్థాన్ ఆర్మీ ఫోకస్ మొత్తం ఇండియాపైనే పెట్టింది. ఇక ఇదే సందు అనుకొని.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ సైనికులపై దాడులకు పాల్పడుతూ.. పాకిస్థాన్ను మరింత ఇబ్బంది పెడుతోంది. ఇలా ఒక వైపు ఇండియా, మరోవైపు బలూచిస్థాన్ దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ దాడుల నుంచి పాక్ రక్షణ పొంది శాంతి కావాలంటే.. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం, ఆశ్రయం కల్పించడం మానేయాలి, అలాగే బలూచిస్థాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..