AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Attack : 26 మంది ప్రాణాలు పోయింది కేవలం రూ.3వేల కోసమా?.. NIA దర్యాప్తులో సంచలన విషయాలు

పచ్చని నేలల్లో రక్తం ఏరులై పారిన దుర్ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తైంది. ప్రకృతిని ఆశ్వాదిస్తున్న అమాయక పర్యాటకులను పొట్ట పెట్టుకున్న ఈ ఉగ్ర దాడికి సంబంధించి మరో సంచలన కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఐఏ విచారణలో ఇద్దరు స్థానికుల పాత్ర బయటపడినట్లు సమాచారం. ఇంతకూ అక్కడ జరిగిందేంటో తెలుసుకుందాం పదండి.

Pahalgam Attack : 26 మంది ప్రాణాలు పోయింది కేవలం రూ.3వేల కోసమా?.. NIA దర్యాప్తులో సంచలన విషయాలు
Nia Investigation Locals
Anand T
|

Updated on: Apr 22, 2026 | 4:07 PM

Share

పహల్గామ్‌లో దాడికి ప్లాన్ చేసిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డాక.. వారికి ఇద్దరు స్థానికులు ఆశ్రయం కల్పించినట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. వాళ్లు వచ్చిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకుండా వారి వివరాలను గోప్యంగా ఉంచారని అధికారులు తాజాగా తెలుసుకున్నారు. వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు సదురు స్థానికులు రూ.3 వేలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. కేవలం రూ.3వేలకు కక్కుర్తి పడి 26 మంది ప్రాణాలను ముష్కరుల చేతిలో పెట్టారని తెలియడంతో స్థానిక ప్రజలు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పహల్గామ్ దాడి వార్షికోత్సవం సందర్భంగా మరోసారి ఉగ్రవాదులు విష ప్రచారం మొదలుపెట్టారు. జైషే మహమ్మద్ కమాండర్ అబ్దుల్ రవూఫ్‌కు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో జిహాద్‌లో చేరండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి.

అయితే, ఈ ఘటనలో అత్యంత బాధాకరం ఏమిటంటే.. ఒక సంవత్సరం గడిచినా బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఆ మానసిక వేదన నుంచి బయటపడలేకపోవడం. ప్రియమైన వారిని కోల్పోయిన ఆ కుటుంబాల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. కొందరు చిన్న పిల్లలు తండ్రిని కోల్పోయారు. కొందరు మహిళలు జీవిత భాగస్వామిని కోల్పోయారు. వృద్ధ తల్లిదండ్రులు తమ కుమారులను కోల్పోయి ఒంటరితనంలో జీవిస్తున్నారు.

పహల్గామ్ ప్రజల జీవితాల్లో కూడా ఈ దాడి మానసిక గాయాలను మిగిల్చింది. గతంలో సందడిగా ఉన్న వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి. పర్యాటకుల రద్దీ తగ్గడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర నష్టాలు చవిచూశారు. కొంతమంది యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఒక ఉగ్రదాడి కేవలం ప్రాణ నష్టానికే పరిమితం కాకుండా, మొత్తం సమాజాన్ని ఎలా దెబ్బతీస్తుందో పహల్గామ్ ఉదాహరణగా నిలిచింది.

దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని ఖండించాయి. అమాయకులపై ఇలాంటి దాడులు మానవత్వానికి మచ్చ అని అంతర్జాతీయ వర్గాలు తెలిపాయి. భారత్ తీసుకున్న కఠిన చర్యలు దేశ భద్రతపై ఉన్న నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పాయి. ప్రధాని మోదీ చేసిన నివాళి సందేశం ఈ సందర్భంగా దేశ ప్రజల్లో భావోద్వేగాన్ని రేకెత్తించింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న స్పష్టమైన సంకేతాన్ని ఆయన మరోసారి ఇచ్చారు. దేశం మొత్తం బాధిత కుటుంబాల వెంట ఉందన్న సందేశం వారికి కొంతమేర ధైర్యాన్ని ఇచ్చింది.

పహల్గామ్ దాడి మనకు ఒక కఠినమైన నిజాన్ని గుర్తుచేస్తోంది. ప్రకృతి అందాల మధ్య కూడా భద్రత ఎంత ముఖ్యమో, ఉగ్రవాదం ఎంత దారుణమైనదో ఈ ఘటన స్పష్టం చేసింది. ప్రాణాలు కోల్పోయిన 26 మంది అమాయకుల జ్ఞాపకాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. వారి కుటుంబాల బాధను మాటల్లో చెప్పలేం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కటిగా నిలబడదాం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us