రాజ్యసభ మొదటిరోజే గందరగోళం.. పెరిగిన ధరలపై ప్రతిపక్షాల ఆందోళన.. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు.
Rahya Sabha today : రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మహిళా ఎంపీలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సభలో ప్రసంగించారు.
ఆ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు సభాధ్యక్షులు వెంకయ్యనాయుడు. క్వశ్చన్ అవర్ మొదలుపెట్టగా.. పెరిగిన ధరలను నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన దిగారు. చమురు, వంటగ్యాస్ ధరలపై విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ‘‘పెట్రోల్ ధర రూ.100 దాటింది. వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. వీటిపై సుంకాలు, సెస్లను పెంచడంతో యావత్ దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ధరల పెంపునకు నిరసనగా విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఛైర్మన్ సభ్యులను వారించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను 11 గంటల వరకు వాయిదా వేశారు.
అంతకుముందు రాజ్యసభ ప్రతిపక్ష నేత బాధ్యతలు తీసుకున్న కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గేను ఛైర్మన్ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ, పాలనాపరమైన అనుభవం ఉందని కొనియాడారు. సభ్యులందరూ సభా సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ చర్చల్లో పాల్గొనాలని వెంకయ్య ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కాగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో తమ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే పేరును కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీంతో ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.