Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కొంపముంచబోతున్న చంద్రశేఖర్తో లింక్స్.. బెయిల్ పొడిగింపుపై ఇవాళ తీర్పు..
జాక్వెలిన్ ఫెర్నాండేజ్కి జైలా, బెయిలా.. అది ఇవాళ తెలుస్తుంది. కానీ.. కోర్టు ముందుకు వచ్చిన ఆమె కేసు విషయంలో ఈడీపై సీరియస్ అయ్యింది కోర్టు.
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అరెస్ట్ ఖాయమా ? సుఖేశ్ చంద్రశేఖర్తో లింక్స్ ఆమె కొంపముంచబోతున్నాయా ? జరుగుతున్న పరిణామాలు జాక్వెలిన్ కష్టాలకు అద్దం పడుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ లోని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరయ్యారు జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఈ కేసులో కోర్టు ఆమెకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగిసింది.దీంతో కోర్టులో హాజరయ్యారు. శుక్రవారం జాక్వెలిన్ బెయిల్ పొడిగింపుపై కోర్టు తీర్పును వెల్లడిస్తుంది. 200 కోట్ల వసూళ్ల కేసులో దర్యాప్తుకు జాక్వెలిన్ సహకరించలేదని , బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించింది ఈడీ. కోర్టులో జాక్వెలిన్ బెయిల్ పిటిషన్పై వాడివేడి వాదనలు జరిగాయి. విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే జాక్వెలిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఎంపిక చేసిన వాళ్లనే అరెస్ట్ చేయడం ఈడీకి అలవాటుగా మారిందని కోర్టు ఘాటైన కామెంట్లు చేసింది.
తీహార్ జైల్లో ఉన్న మహా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్కు కోట్ల రూపాయాలు అందినట్టు ఈడీ ఆరోపించింది. సుఖేశ్ ఇచ్చిన 8 కోట్ల రూపాయలతో ఆమె విలాసవంతమైన జీవితం గడిపినట్టు అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే జాక్వెలిన్ బ్యాంక్ ఖాతాలను ఈడీ జప్తు చేసింది. అయితే ఆ సొమ్మంతా తన కష్టార్జితమని అంటున్నారు జాక్వెలిన్. సుఖేశ్తో ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు.
సుఖేశ్ చంద్రశేఖర్ మాత్రం తాను జాక్వెలిన్తో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్టు ఈడీ విచారణలో వెల్లడించాడు. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు కొనసాగిస్తున్నాడు సుఖేశ్. తీహార్ జైల్లో తనపై విషప్రయోగం చేసి చంపేందుకు ఆప్ నేతలు కుట్ర చేశారని ఆరోపించాడు. కేజ్రీవాల్ అవినీతికి సంబంధించి తన దగ్గర కీలక ఆధారాలు ఉన్నట్టు తెలిపాడు.
మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్కు రెగ్యులర్ బెయిల్ వస్తుందా ? లేక ఈడీ ఆమెను అరెస్ట్ చేస్తుందా ? అన్న విషయంపై శుక్రవారం క్లారిటీ వస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం