AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha I-T Raid: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా నగదు సీజ్‌

తవ్వేకొద్దీ కట్టలు.. బయటకు వస్తున్నాయి. పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టుగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి. అధికారులే దిమ్మతిరిగిపోయేలా గుట్టులు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కౌంటింగ్ చేసేకొద్దీ.. లెక్క పెరుగుతోంది. చేసేది లిక్కర్ దందా.. దోచేది ప్రజల సొమ్ము అన్నట్టుగా ఉందీ ఎంపీ వ్యవహారం..

Odisha I-T Raid: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా నగదు సీజ్‌
It Raids
Shaik Madar Saheb
|

Updated on: Dec 10, 2023 | 8:02 PM

Share

తవ్వేకొద్దీ కట్టలు.. బయటకు వస్తున్నాయి. పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టుగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి. అధికారులే దిమ్మతిరిగిపోయేలా గుట్టులు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కౌంటింగ్ చేసేకొద్దీ.. లెక్క పెరుగుతోంది. చేసేది లిక్కర్ దందా.. దోచేది ప్రజల సొమ్ము అన్నట్టుగా ఉందీ ఎంపీ వ్యవహారం. ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో ఏ అల్మరా తెరిచినా డబ్బే.. ఎక్కడ చూసినా నోట్ల గుట్టలే.. ఎంత డబ్బంటే.. లెక్క బెట్టడానికే రోజుల తరబడి టైమ్ పట్టేంత. డబ్బును లెక్కబెట్టలేక కౌంటింగ్ మెషిన్లే మొరాయించేంత. 200 బ్యాగుల్లో డబ్బును 40 మంది ఐటీ శాఖ సిబ్బంది, బ్యాంక్‌ సిబ్బంది సాయంతో నోట్లను లెక్కిస్తున్నారు. 40 నోట్ల లెక్కింపు యంత్రాలను అధికారులు ఉపయోగిస్తున్నారు. అయితే నోట్లను లెక్కించడానికి సిబ్బంది సరిపోవడం లేదని, మరికొంతమంది సిబ్బందిని పంపించాలని ఐటీ శాఖ అధికారులు కోరుతున్నారు. ఇప్పటిదాకా 300 కోట్లకు పైగా అవినీతి సొమ్ము తేలింది. ఇంకా లెక్కబెట్టాల్సిన బ్యాగులు చాలా ఉన్నాయి. ఇంకా చాలా బ్యాగుల్లో లెక్కించాల్సిన డబ్బు ఉంది. చివరకు కౌంటింగ్ మెషిన్లు కూడా మొరాయించడంతో.. కొన్ని బ్యాంకుల నుంచి కౌంటింగ్ మెషిన్లు తెప్పించి మరీ లెక్కిస్తున్నారు అధికారులు.

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో ఈ నోట్ల గుట్టలు బయటపడటం రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంపీని టార్గెట్‌గా చేసుకుని టోటల్‌ కాంగ్రెస్‌పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. ప్రధాని మోదీ దగ్గర నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అందరూ.. ఈ అంశంపై స్పందిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి దోచుకున్న ప్రతి రూపాయి తిరిగి వసూలు చేయడం గ్యారంటీ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఈ కరెన్సీ నోట్ల కట్టలను చూసిన తర్వాత కొందరు నాయకుల ప్రసంగాలను ప్రజలు వినాలంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి సెటైర్ వేశారు ప్రధాని మోదీ.

రాజకుటుంబం పేరుతో చేసే దోపిడీని ప్రజలు అంగీకరించరు. అవినీతి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. చట్టం వదిలిపెట్టదంటూ ట్వీట్ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి రూపాయి తిరిగి కట్టాల్సిందేనన్నారు. ధీరజ్ సాహూ ఎవరికి ఏటీఎంలా పనిచేస్తున్నారో చెప్పాలంటూ ట్వీట్ చేశారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. కాంగ్రెస్ నేతలు ఏ స్థాయిలో అవినీతి చేశారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఎక్కడ చూసినా.. కాంగ్రెస్‌ది అవినీతి పాలనే అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ నేతలు దోచుకున్న ప్రతి రూపాయిని వసూలు చేస్తామన్నారు. పారదర్శక పాలనే తమ విధానమన్నారు.

ఎంపీ ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడటంతో ఒరిస్సా బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన చేపట్టారు. సీబీఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి.. ఎంపీ అవినీతి చిట్టా విప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు సాహు నుంచే నిధులు అందుతున్నాయని దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ధీరజ్‌సాహు వ్యవహారంపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. దేశంలో ఎక్కడైనా విపక్ష నేతలపై ఐటీ సోదాలు జరిగితే స్పందించే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ధీరజ్ సాహూ లిక్కర్ వ్యాపారాలతో కాంగ్రెస్‌కి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్. పట్టుబడిన డబ్బుకు సంబంధించన పూర్తి వివరాలు ఆయనే చెప్పాలన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us