AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం… ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న కేంద్ర హోంశాఖ

జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీని తయారు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు.

జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం... ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న కేంద్ర హోంశాఖ
Balaraju Goud
|

Updated on: Feb 02, 2021 | 7:13 PM

Share

Nationwide NRC : దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల రిజిస్టర్‌పై మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీని తయారు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. ఎన్‌పిఆర్ సమయంలో పౌరసత్వం, ధృవీకరణ పత్రాల సేకరణ లేదని మంత్రి చెప్పారు. మంగళవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి ఏమైనా ప్రణాళిక ఉందా అని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) చందన్‌ సింగ్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ స్పందించారు.

అయితే దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల కోసం సేకరించే వ్యక్తిగత స్థాయి సమాచారమంతా గోప్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్), జనాభా లెక్కల సేకరణలపై వ్యక్తమవుతున్న భయాలకు సంబంధించి పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. ఈమేరకు రాతపూర్వకంగా వివరణ ఇచ్చింది కేంద్ర హోం శాఖ.

సెన్సస్‌లో కేవలం వివిధ పరిపాలనా స్థాయుల్లో సాధారణ సమాచారాన్ని మాత్రమే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. 2021 జనాభా లెక్కల సేకరణ విజయవంతంగా పూర్తయ్యే విధంగా గతంలో మాదిరిగానే విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రజలకు సరైన అవగాహన కలిగే విధంగా ప్రచారం చేస్తామని వెల్లడించిన మంత్రి… జనాభా లెక్కల సేకరణతోపాటు ఎన్‌పీఆర్‌ ప్రశ్నావళులను విజయవంతంగా దేశవ్యాప్తంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. భారత ప్రజల జాతీయ రిజిస్టర్ తయారీ గురించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వంలోని అనేక స్థాయుల్లో స్పష్టీకరించినట్లు స్పష్టం చేశారు.

ఏప్రిల్ 1 నుండి డెసినియల్ సెన్సస్‌తో పాటు ఎన్‌పీఆర్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఎన్‌పిఆర్ ఫారం ఇంకా ఖరారు కాలేదు. అయితే, గత సంవత్సరం నోటిఫై చేసిన ట్రయల్ ఫారం 21 పారామితులపై 30 లక్షల మంది ప్రతివాదుల వివరాలను సేకరించింది. ఇందులో తల్లిదండ్రుల పేరు, జన్మించిన ప్రదేశం, చివరి నివాస స్థలం వంటి వివరాల సేకరణను ఫారంలో పొందుపర్చారు. అయితే, అనేక ప్రతిపక్షాలు పాలించిన రాష్ట్రాలు ఎన్‌పిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా, ఎన్‌పీఆర్, సెన్సస్‌లపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది ఫిబ్రవరిలో పేర్కొంది. దీనిపై తీసుకున్న చర్యల నివేదికను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

ఎన్‌పీఆర్‌పై స్పష్టమైన, సరైన సందేశాన్ని ప్రజలకు అందజేసేందుకు 360 డిగ్రీల విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాలు, ఏవీ, డిజిటల్, ఔట్‌డోర్, ప్రింట్, నోటి మాటలు వంటివాటి ద్వారా ప్రచారం చేస్తామని పేర్కొంది. ఎన్‌పీఆర్, జనాభా లెక్కలు, 2021లపై తప్పుడు సమాచారాన్ని, వదంతులను ఎదుర్కొనేందుకు సరైన రీతిలో సందేశాలను ప్రజలకు అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో జనాభా లెక్కలు-2021 మొదటి దశను, ఎన్‌పీఆర్ నవీకరణను, సంబంధిత ఇతర క్షేత్ర స్థాయి కార్యకలాపాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వాయిదా వేసినట్లు తెలిపింది.

ఎన్‌పిఆర్‌పై మరో ప్రశ్నకు సమాధానంగా రాయ్ మాట్లాడుతూ..పౌరసత్వం (పౌరుల నమోదు మరియు జాతీయ గుర్తింపు కార్డుల జారీ) నిబంధనలు 2003 లోని రూల్ 3 లోని సబ్-రూల్ (4) ను అనుసరించి, పౌరసత్వ చట్టం క్రింద రూపొందించబడిందన్నారు. జనాభా రిజిస్టర్ అనేది సాధారణంగా ఒక గ్రామం లేదా పట్టణం లేదా వార్డులో ఉన్న ప్రదేశాలలో నివసించే వ్యక్తుల వివరాలను మాత్రమే సేకరిస్తామన్నారు. 1955, సాధారణంగా గ్రామం లేదా పట్టణంలో నివసించే వ్యక్తులందరికీ సంబంధించిన సమాచార సేకరణ కోసం అస్సాం మినహా దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జనాభా రిజిస్టర్‌ను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వివరించారు.

ఇదీ చదవండి…బ్రిటన్ వాసులకు కొత్త గుబులు.. మరో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చిందన్న శాస్త్రవేత్తలు