NEET UG 2025 scam: నీట్ యూజీ స్కోర్ తారుమారుకు స్కెచ్.. ఒక్కోక్కరికి రూ. 90 లక్షలు! కట్చేస్తే సీన్ సితార్..
తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించి.. సీటు లభించే విధంగా చేస్తామంటూ తప్పుడు హామీలు ఇస్తూ అమాయకులను మోసం చేస్తున్నట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పక్కాప్లాన్తో చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసింది. అసలింతకీ ఏం జరిగిందంటే..

ముంబై, జూన్ 15: నీట్ యూజీ ఫలితాలు శనివారం (జూన్ 14) విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది పేపర్ లీకేజీలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్టీయే.. ఈ ఏడాది మాత్రం ఎంతో పకడ్భందీగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. అయితే తాజా ఫలితాల్లో భారీ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. నీట్ స్కోర్లను తారుమారు చేస్తామంటూ నీట్ పరీక్షలు రాసిన విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ఇద్దరు వ్యక్తులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితులు పరీక్ష స్కోర్ కార్డును తారుమారు చేసేందుకు రూ.90 లక్షలను డిమాండ్ చేశారు. వీరిని సోలాపూర్, ముంబయిలకు చెందిన సందీప్ షా, సలీమ్ పటేల్లుగా సీబీఐ గుర్తించింది.
తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించి.. సీటు లభించే విధంగా చేస్తామంటూ తప్పుడు హామీలు ఇస్తూ అమాయకులను మోసం చేస్తున్నట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పక్కాప్లాన్తో చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసింది. స్కామ్ను ఛేదించడానికి సీబీఐ అధికారులు నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులుగా నటిస్తూ.. సందీప్ షాను ముంబైలోని లోయర్ పరేల్లోని ఐటీసీ గ్రాండ్ సెంట్రల్ ఫైవ్ స్టార్ హోటల్లో కలిశారు. అక్కడ సందీప్ షా పలువురి విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి రూ.90 లక్షలు డిమాండ్ చేశాడు. బేరసారాల అనంతరం ఒక్కో అభ్యర్థికి రూ.87.5 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. తక్కువ మార్కులు వచ్చిన వారి స్కోర్ తారుమారు చేసి.. ఎక్కువ మార్కులు వచ్చేలా చేసి నీట్లో అర్హత సాధించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల సహాయంతో చేస్తామని నమ్మబలికారు. దీంతో అక్కడే తల్లిదండ్రుల వేషంలో ఉన్న సీబీఐ అధికారులు సందీప్ షాను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణలో ఈ స్కాంలో సలీం పాటిల్, జావేద్ అలీ పాటిల్ అనే మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో సలీం పాటిల్, సందీప్ షాలను కూడా అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ 2025 పరీక్షకు 22.09 లక్షల మంది హాజరు కాగా, అందులో 12.36 మంది అర్హత సాధించారు. గతేడాది ఏకంటా 13.15 లక్షల మంది నీట్ యూజీలో అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 7.2 లక్షల మంది అమ్మాయిలు, 5.14 లక్షల మంది అబ్బాయిలు ఉన్నారు. అర్హులందరికీ కౌన్సెలింగ్ ద్వారా దేశం వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 1,08,000 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 56 వేల సీట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో. 52 వేలు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. నీట్ ద్వారా దంత, ఆయుర్వేద, యునాని, సిద్ధ వంటి ఇతర వైద్య కోర్సుల్లో కూడా ప్రవేశాలను నిర్వహిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




