నీట్ (UG) పరీక్ష కొత్త తేదీని ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
పేపర్ లీకేజీ దుమారం తర్వాత నీట్(UG) పరీక్షను మళ్లీ నిర్వహిస్తున్నారు. రీ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసింది. పరీక్ష వివాదంపై కీలక నిర్ణయం వెలువడింది. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యార్థులు అధికారిక అప్డేట్స్ను మాత్రమే ఫాలో కావాలని సూచించారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ (NEET) పరీక్ష వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్షలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రీ-ఎగ్జామ్ నిర్వహించేందుకు సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక టైమ్టేబుల్ విడుదలైంది. పరీక్ష కొత్త తేదీ నిర్వహణపై కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకున్నామని NTA చెప్పింది. గురువారం అర్థరాత్రి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంట్లో కీలకభేటీ నిర్వహించారు. సుదీర్ఘ తర్జనభర్జనల తర్వాత కొత్త తేదీని ప్రకటించింది NTA. రీ ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు తాజా అప్డేట్స్ను నిరంతరం పరిశీలించాలని అధికారులు సూచించారు. పేపర్ లీకేజ్ నేపథ్యంలో మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే.
నీట్ పరీక్షలో పారదర్శకతపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. పలుచోట్ల నిరసనలు, కోర్టు పిటిషన్లు, రాజకీయ విమర్శల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రీ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీ, సమయాలపై స్పష్టత కోసం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని విశ్వసించవద్దని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
