క్రెడిట్ కార్డు తీసుకుంటే స్మార్ట్ఫోన్ ఫ్రీ.. తీరా ఆఖర్లో మొబైల్కు వచ్చిన మెసేజ్ చూడగా..!
అమాయకులను మోసం చేసేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మెదడుకు పదునుపెట్టి..

అమాయకులను మోసం చేసేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మెదడుకు పదునుపెట్టి.. సరికొత్త ఐడియాలతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ సైబర్ నేరం ముంబైలో జరిగింది. ఆ కేసు పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ముంబైకి చెందిన ఓ మహిళకు జనవరిలో సౌరభ్ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తమ సంస్థ క్రెడిట్ కార్డు తీసుకుంటే.. స్పోర్ట్స్ క్లబ్లో మెంబర్షిప్ లభిస్తుందని నమ్మించాడు. ఇక సదరు బాధితురాలు అతడి మాటలను నమ్మింది. కార్డు తీసుకునేందుకు అంగీకరించింది. అయితే ఆ మహిళ ఐఫోన్ వినియోగిస్తోందని తెలుసుకున్న నిందితుడు.. తమ క్రెడిట్ కార్డు ఆండ్రాయిడ్ ఫోన్లోనే పని చేస్తుందని.. కార్డు తీసుకుంటే.. స్మార్ట్ ఫోన్ ఫ్రీగా దొరుకుతుందని పేర్కొన్నాడు. దీంతో బాధితురాలు అతడికి తన ఇంటి అడ్రెస్ ఇచ్చింది. అలాగే క్రెడిట్ కార్డు కోసం వ్యక్తిగత వివరాలను, ఆదార్ కార్డు నెంబర్ను సైతం షేర్ చేసింది.
ఇక ఆ స్మార్ట్ఫోన్ను సరాసరి ఆమె ఇంటికే పంపించాడు సైబర్ కేటుగాడు. అందులో ముందుగానే DOT సెక్యూర్, సెక్యూర్ ఎన్వాయ్ ఆథెంటికేటర్ అనే రెండు యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. సిమ్ కార్డు ఇన్సర్ట్ చేసి.. క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేసిందో లేదో.. కొన్ని గంటల్లోనే డబ్బు లావాదేవీలకు సంబంధించిన మెసేజ్లు వచ్చాయి. దాదాపుగా రూ. 7 లక్షలు అకౌంట్ నుంచి మాయం అయినట్లు గుర్తించిన మహిళ.. షాక్కు గురై వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఈ ఘటనపై ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.