Lok Sabha Phase-4 Polling: 4వ విడతలో రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్న నేతలు వీరే

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశలో జరుగుతున్న పోలింగ్‌లో 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఏపీలో ఒకే విడతలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంటే, ఒడిశాలో ఈ విడతలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నాలుగో విడతలో ఏపీ(25), తెలంగాణ (17), బిహార్(5), ఝార్ఖండ్(4), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఒడిశా(4), ఉత్తర్ ప్రదేశ్(13), పశ్చిమ బెంగాల్(8), జమ్ముకశ్మీర్ (1) లోక్‌సభ స్థానాలున్నాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు పోటెత్తి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Lok Sabha Phase-4 Polling: 4వ విడతలో రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్న నేతలు వీరే
Fourth Phase Lok Sabha Elec
Follow us

| Edited By: Srikar T

Updated on: May 13, 2024 | 11:49 AM

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశలో జరుగుతున్న పోలింగ్‌లో 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఏపీలో ఒకే విడతలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంటే, ఒడిశాలో ఈ విడతలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నాలుగో విడతలో ఏపీ(25), తెలంగాణ (17), బిహార్(5), ఝార్ఖండ్(4), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఒడిశా(4), ఉత్తర్ ప్రదేశ్(13), పశ్చిమ బెంగాల్(8), జమ్ముకశ్మీర్ (1) లోక్‌సభ స్థానాలున్నాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు పోటెత్తి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన మొదటి 3 విడతల కంటే ఈ విడతలో మరింత ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. గత కొన్ని వారాలుగా దేశంలోని అనేక ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేసిన హీట్ వేవ్ (వడగాలులు) పరిస్థితి సద్దుమణిగి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ కూడా సూచించింది. కొన్ని చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదు కావొచ్చని కూడా వెల్లడించింది. మొత్తంగా వాతావరణం కూడా 4వ దశ పోలింగ్‌కు సహకరిస్తుందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పిలుపునిస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే.. ఈ విడత జరుగుతున్న పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నేతలు కొందరు పార్లమెంటుకు, మరికొందరు అసెంబ్లీకి పోటీ చేస్తుండగా.. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు ఆ పక్కనే ఉన్న హైదరాబాద్ నియోజకవర్గంలో ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి మాధవీలత దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో 4వ విడతలో ఉన్న ప్రముఖులను ఓసారి పరిశీలిస్తే.. (ఆంధ్రప్రదేశ్ మినహా)

01. అసదుద్దీన్ ఓవైసీ 02. కిషన్ రెడ్డి 03. బండి సంజయ్ 04. అఖిలేష్ యాదవ్ 05. గిరిరాజ్ సింగ్ 06. నిత్యానంద్ రాయ్ 07. శత్రుఘ్న సిన్హా 08. మహువా మొయిత్రా 09. పంకజా ముండే 10. యూసుఫ్ పఠాన్ 11. అధిర్ రంజన్ చౌదరి

ఇవి కూడా చదవండి

అసదుద్దీన్ ఓవైసీ Vs మాధవీలత..

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని పట్టు ప్రదర్శిస్తూ తమ కంచుకోటగా మార్చుకున్న ఓవైసీ కుటుంబాన్ని ఢీకొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) ఈసారి బరిలోకి దించిన అభ్యర్థి మాధవీలత కారణంగా ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తన తొలి ఎన్నికల్లోనే ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఢీకొడుతున్నారు. వరుసగా గత 4 పర్యాయాలు గెలుపొంది, 5వ సారి గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్న అసదుద్దీన్ ఓవైసీని ఆమె ఎంతమేర నిలువరించగల్గుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రచారం సమయంలో ఊహాత్మక విల్లు ఎక్కుపెట్టి యావద్దేశం దృష్టిని ఆకట్టుకోవడంతో పాటు నిత్యం సోషల్ మీడియాలో కనిపించే మాధవీలత, ఓవైసీల కంచుకోటను బద్దలుకొడతారా లేక చతికిలపడతారా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

అఖిలేష్ యాదవ్..

4వ దశ పోలింగ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న 13 నియోజకవర్గాల్లో అందరి దృష్టి ‘కన్నౌజ్‌’ స్థానంపైనే ఉంది. అందుక్కారణం సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ ఇక్కణ్ణుంచి పోటీ చేయడమే. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు తమ కుటుంబం నుంచే మరొకరిని అభ్యర్థిగా ప్రకటించిన అఖిలేష్, చివరి రోజు అనూహ్యంగా తానే నామినేషన్లు పత్రాలు సమర్పించి ఆశ్చర్యానికి గురిచేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచేలా చేశారు. 1998 నుంచి వరుసగా సమాజ్‌వాదీయే గెలుపొందుతూ వస్తున్న ఈ నియోజకవర్గంలో 2019లో ఆ పరంపరకు బ్రేక్ పడింది. ఆ ఎన్నికల్లో అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేసి 12 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆమెను ఓడించిన సుబ్రత్ పాఠక్‌కే బీజేపీ మరోసారి టికెట్ ఇచ్చింది. ఇప్పుడు పోటీ అఖిలేష్ వర్సెస్ పాఠక్‌గా మారింది. నియోజకవర్గం చరిత్రను పరిశీలిస్తే అఖిలేష్ యాదవ్ తండ్రి, సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ గతంలో ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా ప్రాతినిథ్యం వహించారు. విపక్ష (I.N.D.I.A) కూటమిలో పెద్ద భాగస్వామ్య పార్టీ సమాజ్‌వాదీ. ఆ పార్టీ అధినేత పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో యావద్దేశం దృష్టి ఇక్కడ కేంద్రీకృతమైంది.

మహువా మొయిత్రా..

బెంగాల్ ఫైర్ బ్రాండ్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా తన పదునైన విమర్శలతో పార్లమెంటులో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న అభియోగాలపై ఆమె సభ్యత్వం రద్దయిన తర్వాత మళ్లీ ఆమె తన నియోజకవర్గం కృష్ణానగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కల్యాణ్ చౌబేను 60 వేల ఓట్ల తేడాతో ఓడించగా.. ఈసారి ఆమెపై బీజేపీ కృష్ణానగర్ రాజకుటుంబానికి చెందిన అమృతా రాయ్‌ను బరిలోకి దించింది. ఇద్దరు మహిళా నేతల మధ్య హోరాహోరీ పోరు వాతావరణం నెలకొంది.

అధిర్ రంజన్ చౌదరి Vs యూసుఫ్ పఠాన్..

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత (ప్రతిపక్ష నేత) అధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్న బహరామ్‌పూర్ నియోజకవర్గం ఈసారి యావద్దేశ దృష్టిని ఆకట్టుకోడానికి కారణం.. ఆయనపై పోటీకి తృణమూల్ కాంగ్రెస్ (TMC) భారత క్రికెట్ జట్టు ఆటగాడు యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించడమే. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అనేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసినప్పటికీ.. పశ్చిమ బెంగాల్‌లో పొత్తులు, సీట్ల సర్దుబాటు మధ్య ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో బీజేపీ ఓవైపు, తృణమూల్ కాంగ్రెస్ మరోవైపు, కాంగ్రెస్-కమ్యూనిస్టులు కలిసి ఇంకోవైపు పోటీ చేస్తూ ఎన్నికల్లో ముక్కోణపు పోటీకి తెరలేపాయి. 42 సీట్లున్న బెంగాల్ రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ 2 మాత్రమే గెలుచుకోగా, అందులో ఈ నియోజకవర్గం ఒకటి. కాంగ్రెస్, తృణమూల్ అభ్యర్థులిద్దరూ దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేతలు కాగా, బీజేపీ ఇక్కణ్ణుంచి స్థానికంగా ప్రజలకు తన వైద్య సేవలతో సుపరిచితుడైన డా. నిర్మల్ కుమార్ సాహా (సర్జన్)ను బరిలోకి దించింది. మొత్తంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ ఆసక్తిరేపుతోంది.

కిషన్ రెడ్డి..

సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా మోదీ కేబినెట్‌లో కొనసాగుతున్న జి. కిషన్ రెడ్డిపై ఈసారి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. దాంతో ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆయన ఇంకా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఇదెలా ఉంటే.. బీఆర్ఎస్ స్థానికంగా ప్రజల్లో ఆదరణ కల్గిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ (పజ్జెన్న)ను బరిలోకి దించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్న కిషన్ రెడ్డికి ఈ ఎన్నికలు ఓ అగ్నిపరీక్షగా మారాయి. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడం ఒక లక్ష్యమైతే, తన సొంత నియోజకవర్గంలో గెలుపు, మెజారిటీ అన్నది కూడా చర్చనీయాంశాలుగా మారాయి. మొత్తంగా సికింద్రాబాద్ నియోజకవర్గం ముక్కోణపు పోటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బండి సంజయ్..

బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న బండి సంజయ్ రెండోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఎన్నికలివి. ఆయన తన మొదటి ప్రయత్నంలోనే 2019లో బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన బోయినపల్లి వినోద్ కుమార్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ ఈ ఇద్దరిపై వెలిచాల రాజేందర్ రావును బరిలోకి దించింది. రాష్ట్రంలో బీజేపీని హైదరాబాద్ నగరం దాటించి రాష్ట్రంలో విస్తరించి, ఒక ఊపు తెచ్చిన నేతగా బండి సంజయ్‌కు పేరుంది. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పార్టీ గ్రామీణ స్థాయిలో శరవేగంగా విస్తరించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..