Watch: ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు.. ఏకంగా కిలోన్నర బంగారంతో పరార్!
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో భారీ బంగారం చోరీ కలకలం రేపింది. షాహగంజ్ ప్రాంతంలోని విశ్వాస్ జ్యువెలర్స్లో కస్టమర్లుగా నటించిన ముఠా సుమారు 1.5 కిలోల బంగారాన్ని దోచుకుంది. ముందుగా రెక్కీ నిర్వహించి, సిబ్బంది దృష్టి మరల్చి దొంగతనం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో భారీ బంగారం చోరీ కలకలం రేపింది. నగరంలోని షాహగంజ్ ప్రాంతంలో ఉన్న ‘విశ్వాస్ జ్యువెల్లర్స్’లో కస్టమర్లుగా నటించిన ఓ ముఠా సుమారు 1.5 కిలోల బంగారాన్ని చోరీ చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు పురుషులు, బుర్ఖాలు ధరించిన నలుగురు మహిళలు వేర్వేరు సమయాల్లో కస్టమర్ల మాదిరిగా జ్యువెల్లరీ షోరూమ్లోకి ప్రవేశించారు. ముందుగా షోరూమ్లో పరిస్థితులను గమనించి రెక్కీ నిర్వహించిన ముఠా.. ఆ తర్వాత తమకు అనుకూలమైన సమయం కోసం వేచి చూసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎవరికి అనుమానం రాకుండా ఒక్కొక్కరుగా షోరూమ్లోకి వచ్చిన ముఠా సభ్యులు.. సిబ్బంది దృష్టి మరలిన సమయంలో సుమారు 1.5 కిలోల బంగారం ఉన్న పెట్టెను అపహరించి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం షోరూమ్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
చోరీ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ముఠా సభ్యులు షోరూమ్ నుంచి వెళ్లిన మార్గాలు, వారు ఉపయోగించిన వాహనాలు, దాక్కునే అవకాశం ఉన్న ప్రాంతాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
