Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha ShivaRatri :మహాశివరాత్రి స్పెషల్ ఉనకోటీశ్వర కాలభైరవుడి ఆలయం ప్రత్యేకతలు ఇవే..

అది దేవలోకానికి మార్గమంటారు కొందరు.. కాదు...శివుడు నడయాడిన మార్గమంటారు మరికొందరు.. మహాద్భుతం అంటారు చరిత్రకారులు.. ఎవరెమన్నా ఉనకోటీశ్వర కాలభైరవుడి ఆలయం

Maha ShivaRatri :మహాశివరాత్రి స్పెషల్ ఉనకోటీశ్వర కాలభైరవుడి ఆలయం ప్రత్యేకతలు ఇవే..
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Feb 21, 2020 | 4:15 AM

Maha ShivaRatri : అది దేవలోకానికి మార్గమంటారు కొందరు.. కాదు…శివుడు నడయాడిన మార్గమంటారు మరికొందరు.. మహాద్భుతం అంటారు చరిత్రకారులు.. ఎవరెమన్నా ఉనకోటీశ్వర కాలభైరవుడి ఆలయం మాత్రం విస్మయానందకరం! ఎందుకంటే మనిషి కనిపించని మహారణ్యంలో అందమైన శిల్పాలు ఉండటం అద్భుతమే కదా! అత్యంత పురాతనమైన శైవక్షేత్రాన్ని దర్శించుకోడానికి ప్రాణాలు గుప్పిట పెట్టుకుని పయనించాలి.. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఉనకోటి అనే ప్రదేశం ఉంది…ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం… నిజంగానే ఈ ఉనకోటిలో కోటి శిల్పాలు కనిపిస్తాయి.. వాటిని ఎవరు ఎప్పుడు ఎందుకు చెక్కారో ఎవరికీ తెలియదు.. కాకపోతే ఓ స్థలపురాణం ఉంది… ఓసారి కోటిమంది దేవతలతో కలిసి పరమశివుడు కైలాసానికి బయలుదేరాడు.. మార్గమధ్యంలో ఇక్కడి ప్రకృతి సోయగానికి సమ్మోహితుడై కాసేపు విశ్రమించాలనుకున్నాడు.. నిజానికి దేవతల మనస్సులోనూ ఇదే ఉంది.. రాత్రి అక్కడ బస చేసి పొద్దున్నే ప్రయాణం కొనసాగించాలనుకున్నారు.

సూర్యోదయానికి ముందే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని .. లేకపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని శివుడు దేవతలను హెచ్చరిస్తాడు.. అయితే అలసట కారణంగా దేవతలు గాఢ నిద్రలోకి జారుకుంటారు.. తెల్లవారుతుంది కానీ దేవతలు మాత్రం నిద్రలేవరు.. దాంతో శివుడికి కోపం వచ్చేస్తుంది… చెప్పిన మాట విననందుకు అక్కడ శిలలై పవి ఉండండని దేవతలను శపిస్తాడు.. శివుడి శాపం వల్ల దేవతలు శిల్పాలుగా మారిపోయారు.. స్థానికులు ఇంకో కథ కూడా చెబుతారు.. అప్పట్లో కల్లు కంహార అనే గొప్ప శిల్పి ఉండేవాడు.. ఆయన శక్తి ఉపాసకుడు.. ఓ రోజు శివగణాల సమేతంగా శివపార్వతులు ఈ మార్గం నుంచి వెళుతున్నారు. విషయం తెలుసుకున్న కంహార … మీతో పాటు నేను కూడా వస్తానని ఆదిదంపతులను వేడుకుంటాడు.. పరమేశ్వరుడు అందుకు అంగీకరించడు.. పార్వతిదేవి మాత్రం ఓ కండిషన్‌ పెడుతుంది. తెల్లవారేసరికి కోటి శిల్పాలు చెక్కగలిగితే శివుడిని ఒప్పిస్తానని అంటుంది.. కంహార అందుకు సరేనంటాడు.. ఆనందంగా శిల్పాలు చెక్కడం మొదలు పెడతారు.. తెల్లవారుతుంది.. అంత కష్టపడినా కంహార కోటి శిల్పాలను చెక్కలేకపోతాడు.. కోటికి ఒకటి తక్కువవుతుంది.. కంహార కైలాసానికి వెళ్లే అవకాశాన్ని కోల్పోతాడు.. అయినా బొందితో కైలాసానికి వెళ్లానుకోవడం తప్పు కదా!

అందుకే శివపార్వతులు అలా చేశారన్నమాట! కథల సంగతేమిటో కానీ.. ఉనకోటిలోని శిల్పాలన్నీ ఎత్తయినవే..! ఒక్కోటి 30 నుంచి 40 అడుగుల ఎత్తు ఉంటాయి.. అదేమిటో కానీ అన్ని శిల్పాలు అసంపూర్తిగానే ఉంటాయి.. విగ్రహాల ముఖకవళికలు అక్కడి గిరిజనుల మోములను పోలి ఉంటాయి.. అలంకరణ కూడా అలాగే ఉంటుంది.. ఈ పర్వత ప్రాంతంలో ప్రతి చోటకు వెళ్లడానికి ఎగుడుదిగుడుగా..అడ్డదిడ్డంగా మెట్లు ఉన్నాయి.. పర్వతాలను కలుపుతూ వంతెనలు కూడా ఉన్నాయి.. ఇక్కడ వెలిసిన శివుడికి ఉనకోటీశ్వర కాలభైరవుడని పేరు.. దాదాపు30 అడుగుల ఎత్తులో శివుడి విగ్రహం ఉంటుంది.. ఆ పరమేశ్వరుడి తలే పది అడుగులు ఉంటుంది.. ఆ లెక్కన పూర్తి విగ్రహం ఎంత ఎత్తుంటుందో ఊహించుకోవచ్చు… శివుడికి ఓవైపు సింహవాహిని అయిన పార్వతీదేవి .. మరోవైపు గంగాదేవి ఉంటారు..శివుడి పాదాల చెంత మూడు పెద్దపెద్ద నంది విగ్రహాలు భూమిలో కూరుకుపోయినట్టు కనిపిస్తాయి.. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో ఇక్కడో పెద్ద ఉత్సవం జరుగుతుంది.. అశోకాష్టమిగా జరుపుకునే ఈ వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు..