Who is Krish Bhagat : ముంబై ఇండియన్స్ టీమ్లోకి కొత్త కుర్రాడు.. ఎవరీ క్రిష్ భగత్? అంకోలేకర్ స్థానంలో ఎంట్రీ
Who is Krish Bhagat : గాయపడిన అథర్వ అంకోలేకర్ స్థానంలో క్రిష్ భగత్ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. పంజాబ్ ఆల్రౌండర్ అయిన క్రిష్ భగత్ ప్రాక్టీస్ సెషన్లలో, ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఇతడు వేసిన బంతులకు కోచింగ్ స్టాఫ్ ఫిదా అయిపోయారు.

Who is Krish Bhagat : ఐపీఎల్ 2026 సీజన్లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ (MI) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన యువ ఆటగాడు అథర్వ అంకోలేకర్ స్థానంలో క్రిష్ భగత్ (Krish Bhagat) అనే కొత్త కుర్రాడిని జట్టులోకి తీసుకుంది. సీజన్ ప్రారంభానికి ముందే అంకోలేకర్ మోకాలి గాయంతో తప్పుకోగా, నాలుగు మ్యాచ్ల తర్వాత ముంబై మేనేజ్మెంట్ ఈ రీప్లేస్మెంట్ను అధికారికంగా ప్రకటించింది. నేడు పంజాబ్ కింగ్స్తో జరగనున్న కీలక మ్యాచ్కు ముందే ఈ మార్పు చోటుచేసుకోవడం విశేషం.
ఎవరీ క్రిష్ భగత్?
21 ఏళ్ల క్రిష్ భగత్ రైట్ హ్యాండ్ ఆల్రౌండర్. ఇతడు దేశవాళీ క్రికెట్లో పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్రిష్ ఒక మంచి పేస్ బౌలర్ మాత్రమే కాదు, లోయర్ ఆర్డర్లో వచ్చి భారీ షాట్లు ఆడగల సమర్థుడు. గత రెండేళ్లుగా ఇతడు ముంబై ఇండియన్స్ ట్రయల్స్లో పాల్గొంటున్నాడు. ఈ ఏడాది జరిగిన డివై పాటిల్ టీ20 కప్లో రిలయన్స్ జట్టు తరపున ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు.
సపోర్ట్ బౌలర్ నుంచి మెయిన్ స్క్వాడ్ వరకు
క్రిష్ భగత్ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచి ముంబై ఇండియన్స్ జట్టుతో ఒక సపోర్ట్ బౌలర్గా ప్రయాణిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్లలో, ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఇతడు వేసిన బంతులకు కోచింగ్ స్టాఫ్ ఫిదా అయిపోయారు. “క్రిష్ చూపించిన అంకితభావం, కష్టపడే తత్వం మమ్మల్ని ఆకట్టుకున్నాయి. అందుకే అతడిని ప్రధాన జట్టులోకి తీసుకున్నాం” అని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
రికార్డులు ఎలా ఉన్నాయి?
క్రిష్ భగత్ కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఇప్పటివరకు ఆడిన 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 145 పరుగులు చేయడమే కాకుండా 7 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 9 మ్యాచ్లాడి 52 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు. గణాంకాలు తక్కువగా ఉన్నప్పటికీ, టి20 ఫార్మాట్కు కావాల్సిన వేగం, హిట్టింగ్ పవర్ ఇతడిలో పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ముంబైకి నేడు కీలక మ్యాచ్
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. రోహిత్ శర్మ ఫిట్నెస్ కూడా జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేడు వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. సరిగ్గా మ్యాచ్కు ముందు క్రిష్ భగత్ వంటి యువ రక్తం జట్టులోకి రావడం ముంబైకి మానసిక బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
