IND vs SL: టీమిండియా ప్లేయర్లకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అందుకు సిద్ధంగా ఉండాలంటూ..!
Gautam Gambhir Big Message Team India: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై సిరీస్ విజయం భారత్కు అత్యంత అవసరం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకంలో యంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Gautam Gambhir Big Message Team India: శ్రీలంకతో జరగబోయే అత్యంత కీలకమైన రెండు టెస్టుల సిరీస్కు ముందు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లలో జోష్ నింపాడు. ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభమయ్యే మొదటి టెస్టు తొలి రోజే మైదానంలో ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన ఘాటు హెచ్చరిక జారీ చేశాడు.
మొదటి రోజు నుంచే కష్టపడాలి.. పరిమితులను అధిగమించండి..!
శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలోని ఎన్సీసీ మైదానంలో టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడిన గంభీర్.. తమ ముందు ఉన్న లక్ష్యం ఎంత పెద్దదో గుర్తుచేశాడు. మన పరిమితులను దాటుకుని శ్రమించాలని, ప్రతి ఒక్కరూ సాధనలో ఏ లోటూ ఉంచకూడదని పిలుపునిచ్చాడు.
ఆగస్టు 15న ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా మైదానంలో ప్రత్యర్థి విసిరే ప్రతి సవాలుకూ సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని గంభీర్ స్పష్టం చేశాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 48.15 శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 41.67 శాతంతో ఆరో స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తుచేశాడు.
కొత్త ఆటగాళ్లకు వెల్ కమ్.. రంజీ హీరోపై ప్రశంసల వర్షం..!
జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ ఘనంగా స్వాగతం పలికాడు. ఆల్ రౌండర్ సారాంశ్ జైన్ కష్టపడే తత్వాన్ని మెచ్చుకుంటూ.. మైదానంలో లభించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని దేశానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని సూచించాడు.
గత రంజీ సీజన్లో జమ్మూ కాశ్మీర్ జట్టును ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన యంగ్ పేసర్ ఆకిబ్ నబీపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అతడు సాధించిన విజయాన్ని అభినందిస్తూ జట్టులోకి ఆహ్వానించాడు.
కొత్త ఫీల్డింగ్ కోచ్ రాక.. గెలుపే ఏకైక లక్ష్యం..!
జట్టు కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్ను సైతం గంభీర్ ఆటగాళ్లకు పరిచయం చేశాడు. పలు ప్రతిష్టాత్మక జట్లతో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉందని ప్రశంసించాడు. శుభదీప్ ఇచ్చే ఎనర్జీ, నిబద్ధత జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు బాగా ఉపయోగపడతాయని ధీమా వ్యక్తం చేశాడు.
ఆగస్టు 7 నుంచి 9 వరకు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన అనంతరం భారత జట్టు గాలే బయలుదేరనుంది. అక్కడ ఆగస్టు 15న తొలి టెస్టు ఆడనున్న భారత్, ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో రెండో టెస్టులో తలాపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




