Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. ఈ 4 రైల్వే స్టేషన్ల పేరు మార్పు.. ఎందుకంటే..!
కర్ణాటకలోని నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్ల పేర్లను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరి కావడంతో కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేసింది. విజయపుర, బెళగావి, బీదర్, సూరగొండనకొప్ప స్టేషన్లకు స్థానిక ప్రాముఖ్యత ఉన్న నలుగురు సాధువుల పేర్లు పెట్టాలని మంత్రి పాటిల్ ప్రతిపాదించారు.

కర్ణాటకలో పలు రైల్వే స్టేషన్ల పేరు మారనుంది. కర్ణాటక మంత్రి ఎం.బి. పాటిల్, రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్ల పేరు మార్చాలని కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు. స్థానిక సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతకు అనుగుణంగా ఈ పేరు మార్పులు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. విజయపుర, బెళగావి, బీదర్, శివమొగ్గ జిల్లాలోని సూరగొండనకొప్ప స్టేషన్లకు ప్రముఖ సాధువుల పేర్లు పెట్టాలని ఆయన సిఫార్సు చేశారు.
విజయపుర రైల్వే స్టేషన్ను జ్ఞాన యోగి శ్రీ సిద్ధేశ్వర స్వామిజీ రైల్వే స్టేషన్గా, బెళగావి స్టేషన్ను శ్రీ బసవ మహాస్వామిజీ రైల్వే స్టేషన్గా మార్చనున్నారు. అదేవిధంగా బీదర్ స్టేషన్కు చన్నబసవ పట్టదేవరు రైల్వే స్టేషన్ అని, సూరగొండనకొప్ప స్టేషన్కు భయగడ రైల్వే స్టేషన్ అని పేరు మార్చాలని సిఫార్సు చేశారు. ఈ నలుగురు సాధువులు కర్ణాటకలోని ఈ ప్రాంతాలకు గణనీయమైన కృషి చేశారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు స్టేషన్లకు సాధువుల పేర్లను పెట్టాలని సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల శాఖ తరఫున అధికారిక ప్రకటనను కేంద్రానికి పంపినట్లు మంత్రి తెలిపారు. ఈ నాలుగు రైల్వే స్టేషన్లు కూడా సౌత్ వెస్ట్ రైల్వేలోని హుబ్బళ్లి డివిజన్ పరిధిలోకి వస్తాయి. పేరు మార్పును త్వరగా ఆమోదించి, అధికారిక గెజిట్లో తెలియజేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




