Karnataka Election: రంజుగా మారుతున్న కర్ణాటక రాజకీయం.. ఆప్‌ నుంచి బీజేపీలోకి కీలక నేత జంప్..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వ్యూహాలను పదునుపెట్టాయి.

Karnataka Election: రంజుగా మారుతున్న కర్ణాటక రాజకీయం.. ఆప్‌ నుంచి బీజేపీలోకి కీలక నేత జంప్..
Karnataka Election

Updated on: Mar 01, 2023 | 12:57 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వ్యూహాలను పదునుపెట్టాయి. బీఆర్ఎస్ పార్టీ సైతం కర్ణాటకలో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం దక్షిణ రాష్ట్రం కర్ణాటకపై ఫోకస్ పెట్టింది. మాజీ అధికారులను రంగంలోకి దింపేందుకు సన్నాహాలను చేస్తున్న ఆప్ పార్టీకి ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ఐపీఎస్ అధికారి, ఆప్ నేత భాస్కర్ రావు బుధవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. భాస్కర్ రావు ఆప్ మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన గత ఏడాది ఏప్రిల్‌లో పార్టీలో చేరారు. మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ (ADGP)-ర్యాంక్ అధికారి AAPలో “పారదర్శకత లోపమే” పార్టీ నుంచి నిష్క్రమించడానికి కారణమని పేర్కొన్నారు. అవినీతిపై పోరాటం పేరుతో పార్టీ విరాళాలు సేకరిస్తుందని ఆయన ఆప్ పై విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

‘’ప్రధాని మోడీ చేస్తున్న పనులు చూసి బీజేపీలో చేరాను. పార్టీ (ఆప్)లో పారదర్శకత కొరవడింది. ఇది బహుళజాతి సంస్థలా నడుస్తోంది. అవినీతిపై పోరాటం పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. ఆప్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు జైలులో ఉండటం సిగ్గుచేటు. పార్టీలో స్పష్టత లేదు’’ అంటూ భాస్కర్ రావు మీడియాతో పేర్కొన్నారు.

బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉందని.. ఈ క్రమంలో తాను బీజేపీకి మరింత సహకారం అందించగలనని అనుకుంటున్నానని.. ప్రధాని మోదీ దార్శనికత తనను పార్టీలో చేరేలా ప్రేరేపించిందని పేర్కొన్నారు.

కర్ణాటక దేవాదాయ శాఖ మంత్రి ఆర్‌.అశోక, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం నిర్వహించిన అనంతరం బిజెపిలో చేరాలని భాస్కర్ రావు నిర్ణయించుకున్నారు.

కాగా.. భాస్కర్ రావు.. వ్యక్తిగత కారణాల వల్ల గత సంవత్సరం IPS నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. బసవనగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ AAPలో చేరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..