Export Duty On Petrol, Diesel: ఇంధన ఎగుమతులపై ట్యాక్స్ పెంపు.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయా?!
Export Duty On Petrol, Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గనున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
Export Duty On Petrol, Diesel: దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించడానికి, పెట్రోలియం ఉత్పత్తుల స్టాక్ను నిర్వహించడానికి భారత ప్రభుత్వం ఇవాళ పెట్రోల్, డీజిల్, ATF పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. పెట్రోల్పై ఎగుమతి సుంకాన్ని లీటర్కు రూ.5, డీజిల్పై రూ.12 చొప్పున పెంచారు. ఎటిఎఫ్పై ఎగుమతి సుంకాన్ని లీటర్కు రూ.6 పెంచారు. వివిధ ఇంధనాలపై ఎగుమతి సుంకాన్ని పెంచడం వల్ల, దేశీయంగా చమురు నిల్వలు పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఎగుమతి చేసే పెట్రోల్లో 50 శాతం, 30 శాతం డీజిల్ను దేశీయ మార్కెట్లలో విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. పెరుగుతున్న ముడి చమురు ధరల నుండి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఇదిలాఉంటే.. చమురు ఎగుమతులపై ట్యాక్స్ విధించడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే, నేపాల్, భూటాన్ దేశాలు ఈ పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు సుంకం చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు. అలాగే, ఈ షరతు 100 శాతం EoUలు, SEZ యూనిట్లకు కూడా వర్తించదు అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇకపోతే ముడిచమురు ఉత్పత్తిదారులు ఆర్జించే విండ్ ఫాల్ లాభాలపై కూడా ప్రభుత్వం పన్నులను ప్రకటించింది. అంతర్జాతీయంగా అధిక చమురు ధరల నుండి ఉత్పత్తి దారులకు లభించే విండ్ఫాల్ లాభాలను తగ్గించడానికి ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై టన్నుకు రూ. 23,230 అదనపు పన్నును విధించింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.
ఇదిలాఉంటే.. ఎగుమతి పన్ను పెంపు ప్రకటన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జిసి) షేర్లు భారీగా పడిపోయాయి. శుక్రవారం ప్రారంభ డీల్స్లో ఆర్ఐఎల్ షేర్లు 5 శాతానికి పైగా పతనం కాగా, ఓఎన్జిసి 10 శాతం పడిపోయింది.