Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్లోనే 9 మంది సజీవదహనం!.. ఎక్కడంటే?
Karnataka Bus Accident: రెప్పపాటు నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తోంది. కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగులుస్తుంది.. తెల్లవారుజామున కర్నాటకలో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయ్. ఓ లారీ డ్రైవర్ అజాగ్రత్త.. ఇప్పుడు ఏకంగా 9 మంది ప్రాణాలు తీసింది. రోడ్డు అవతలివైపున్న లారీ అదుపుతప్పడం.. పల్టీ కొట్టి డివైడర్ ఎక్కేసి ఇటువైపు రావడం.. అదే సమయంలో అటుగా వెళ్తున్న స్లీపర్ బస్సును వెనుక భాగంలో ఢీకొట్టడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ యాక్సిడెంట్ జరిగిన క్షణాల్లోనే మంటలు చెలరేగి అటు బస్సు.. ఇటు లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

చిత్రదుర్గ జిల్లాలో హిరియూర్ తాలూకాలోని గొర్లతు క్రాస్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి 48పై ఒక వైపు నుంచి వస్తున్న లారీ డివైడర్ను దాటి, మరొక వైపు నుండి వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో స్లీపర్ కోచ్ బస్సు రోడ్డు మధ్యలో మంటల్లో చిక్కుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. లారీ హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బస్సు బెంగళూరు నుండి శివమొగ్గకు వెళుతోంది. ఘటనకు సంబంధించి హిరియూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ప్రమాద విషయం తెలియగానే ఫైరింజన్లు, అంబులెన్స్లు స్పాట్కి చేరుకున్నా అప్పటికే మంటలు పూర్తిగా అంటుకుపోయాయి. స్లీపర్ బస్ కావడంతో ప్రమాదం తర్వాత లోపలున్న వారు తప్పించునేందుకు వీల్లేకుండా పోయింది. బస్సును లారీ ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగాయి. చీకట్లో ఏం జరుగుతుందో లోపలున్న వాళ్లకు అర్థం కాలేదు. దీంతో కొందరు బయటకు రాగా, మరికొందరు అక్కడే సమాదైపోయారు. ఇక రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ గాయపడిన వారిని తుమ్కూర్ హాస్పిటల్లో చేర్పించారు స్వల్ప గాయాలైన వారిని తలక్ హాస్పిటల్లో చేర్పించారు పోస్ట్ మార్టమ్ అనంతరం డెడ్బాడీలను గుర్తించి బంధువులకు అప్పగిస్తామంటున్నారు అధికారులు.
ఇక ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. డివైడర్ దాటి మరీ లారీ ఇటువైపు వచ్చి బస్సును ఢీకొట్టడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఊహించని విధంగా ముంచుకొచ్చిన మృత్యువు స్లీపర్ బస్సులో ఉన్న 9 మందిని మింగేసింది. స్లీపర్ బస్సుల్లో ప్రమాదం జరిగితే తప్పించుకోవడం చాలా కష్టంగా మారుతోంది.ఇప్పటికే కర్నూలు, రాజస్థాన్లో జరిగిన ఘోరాలు చూశాం.. తాజాగా తెల్లవారుజామున మృత్యువు మాటేసినట్టుగా.. యాక్సిడెంట్ అయిన క్షణాల్లోనే మంటలు చెలరేగడం, అందరూ కాలి బూడిదైపోవడం.. ఆ దృశ్యాలు గండెలను పిండేస్తున్నాయ్.
ఈ ప్రమాదానికి సంబందించిన అప్డేట్స్ ఇక్కడ చూడండి..




