Jammu-Kashmir: కశ్మీర్ లో మంచు వర్షం.. గజగజ వణికిపోతున్న ప్రజలు.. రైళ్లు, కాలేజీలు అన్నీ బంద్..
ఉత్తర భారతంపై చలి పంజా విసురుతోంది. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలతో జమ్మూ కశ్మీర్ వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న మంచు వర్షం ధాటికి కశ్మీర్ లోయ.. ధవళ వర్ణాన్ని సంతరించుకుంది. వ్యాలీలో ఎక్కడ...
ఉత్తర భారతంపై చలి పంజా విసురుతోంది. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలతో జమ్మూ కశ్మీర్ వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న మంచు వర్షం ధాటికి కశ్మీర్ లోయ.. ధవళ వర్ణాన్ని సంతరించుకుంది. వ్యాలీలో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై మంచు పేరుకుంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇల్లు, రోడ్లు, బడి, గుడి.. ఇలా ఒక్కటేమిటి.. కనుచూపు మేర ఎక్కడ చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్మార్గ్, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. గుల్మార్గ్, పహల్గావ్ పర్యాటక రిసార్ట్లు మంచుతో నిండిపోయాయి. శ్రీ నగర్లోని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు.
జమ్మూ-శ్రీనగర్, శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారులతో పాటు వ్యాలీలోని పలు ప్రధాన రోడ్లపై రాకపోకలను నిషేధించారు. అధికారులు మూసివేశారు. భారీగా కురుస్తున్న మంచు కారణంగా విజబిలిటీ తక్కువగా ఉంది. దీంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. విజబిలిటీ కేవలం 200 మీటర్లు మాత్రమే ఉండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై కూడా మంచు వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. రైలు పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
#WATCH | Kashmir valley covered in a sheet of snow as Srinagar and other parts of the valley received fresh snowfall.
Visuals from Srinagar, this morning. pic.twitter.com/J678e8LwfY
— ANI (@ANI) January 30, 2023
మరోవైపు.. యూనివర్సిటీలు, కాలేజీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 30వ తేదీన (జనవరి 30, సోమవారం) జరగాల్సిన అన్ని పీజీ, ఇంజినీరింగ్ తదితర పరీక్షలు వాయిదా వేసింది. పరిస్థితి చక్కబడ్డాక కొత్త తేదీలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.