ఢిల్లీ అల్లర్ల కేసులో 17 వేల పేజీల చార్జిషీట్, నిందితులపై అభియోగాల వెల్లువ
సీఏఏకి (సవరించిన పౌరసత్వ చట్టానికి) నిరసనగా ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లపై పోలీసులు 17 వేల పేజీల చార్జిషీట్ ను రూపొందించారు. వివాదాస్పదమైన ఈ చట్టానికి నిరసనగా నగరంలోని పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించగా..
సీఏఏకి (సవరించిన పౌరసత్వ చట్టానికి) నిరసనగా ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లపై పోలీసులు 17 వేల పేజీల చార్జిషీట్ ను రూపొందించారు. వివాదాస్పదమైన ఈ చట్టానికి నిరసనగా నగరంలోని పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించగా అనేకమంది గాయపడ్డారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్థి నష్టం జరిగింది. కాగా ఈ చార్జిషీట్ లో ఆప్ నుంచి సస్పెండయిన కౌన్సిలర్ తాహిర్ హుసేన్ సహా పలువురిని నిందితులుగా చేర్చారు. వేలాది పేజీల్లో కఠిన తరమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిబంధనల కింద మోపిన ఆరోపణలు, అభియోగాల గురించి కూడా ప్రస్తావించారు. రెండు పెద్ద స్టీల్ ట్రంక్ పెట్టెల్లో ఖాకీలు వీటిని కోర్టుకు మోసుకు వచ్చారు. ఈ చార్జిషీట్ లో పేర్కొనని ఇంకా చాలామంది నిందితుల పేర్లతో అనుబంధ చార్జిషీట్ ను సమర్పిస్తామని వారు తెలిపారు. పలువురు విద్యార్ధి సంఘాల నేతల పేర్లను చేర్చవలసి ఉందని వారు చెప్పారు. వాట్సాప్ గ్రూప్ చాట్ ల ద్వారా చాలామంది సీఏఏ వ్యతిరేక ప్రచారం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఖాకీలు ఇంత భారీ చార్జిషీట్ రూపొందించి కోర్టుకు సమర్పించబోవడం గమనార్హం.