కంటతడి పెడుతున్న కశ్మీరీ యాపిల్ రైతన్నలు

జమ్ముకశ్మీర్‌లో గత మూడు నెలలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. యాపిల్ రైతన్నలకు కన్నీటిని మిగిల్చాయి. గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ మంచు వర్షం కారణంతో చేతికొచ్చిన యాపిల్ పంట నేలపాలవుతోంది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కశ్మీర్ లోని పుల్వామా, షోపియన్, రామ్‌నగర్, కెల్లార్, జామ్‌నగర్, సెడావ్ మరియు మీర్పూర్ ప్రాంతాలలో ఎక్కువగా యాపిల్ పంటలపైనే ఇక్కడి ప్రజల జీవనం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల్లో యాపిల్ రైతుల నష్టాన్ని అంచనా వేసేందుకు […]

కంటతడి పెడుతున్న కశ్మీరీ యాపిల్ రైతన్నలు
Follow us

| Edited By:

Updated on: Nov 17, 2019 | 6:32 AM

జమ్ముకశ్మీర్‌లో గత మూడు నెలలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. యాపిల్ రైతన్నలకు కన్నీటిని మిగిల్చాయి. గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ మంచు వర్షం కారణంతో చేతికొచ్చిన యాపిల్ పంట నేలపాలవుతోంది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కశ్మీర్ లోని పుల్వామా, షోపియన్, రామ్‌నగర్, కెల్లార్, జామ్‌నగర్, సెడావ్ మరియు మీర్పూర్ ప్రాంతాలలో ఎక్కువగా యాపిల్ పంటలపైనే ఇక్కడి ప్రజల జీవనం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల్లో యాపిల్ రైతుల నష్టాన్ని అంచనా వేసేందుకు అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో.. ఏడుగురు సభ్యుల బృందం మూడు రోజుల పాటు పర్యటించింది. మాజీ ఎంపీ రాజు శెట్టి, సామాజిక శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్, వ్యవసాయ నాయకుడు వీఎం. సింగ్ ఈ బృందంలో ఉన్నారు. కశ్మీర్ లోయలోని రైతులు, పండ్ల అమ్మకం దార్లు, వ్యాపారస్తుల కష్టనష్టాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్‌ లోయలో.. విధించిన నిరవధిక కర్ఫ్యూతో యాపిల్ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ముఖ్యంగా అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో వర్తకం నిలిచిపోయిందని.. అదే సమయంలో ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడంతో.. యాపిల్‌ బాక్సులను ఇతర ప్రాంతాలకు తరలిచండంలో ఇబ్బందులు తలెత్తినట్లు రైతులు వాపోయారు. కేవలం ఒక్క యాపిల్ రైతులే కాదు.. పియర్, చెర్రీ, ద్రాక్ష రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో రైతులు, కొనగోలు దారుల మధ్య వ్యాపారలావాదేవీలు జరగడంలో ఇబ్పందులు తలెత్తాయి. దీంతో యాపిల్స్ అన్నీ అలానే ఉన్నాయని.. వాటిని సంరక్షించేందుకు శీతల గిడ్డంగులు కూడా లేకపోవడంతో.. భారీగా పండ్లు చెడిపోయాయని రైతులు తెలపారు. అంతేకాదు.. అమ్మకాలు లేకపోవడంతో.. రూ.600 పలికే పెట్ట రూ.100 కే అమ్మాల్సి వచ్చిందని కొందరు రైతులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం “నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా”  ద్వారా యాపిల్ పండ్లను సేకరించి రైతులకు ఇబ్బందులు కల్గకుండా చేస్తుందని ప్రకటించిందని.. అయితే పండిన పంటలో కేవలం ఒక్కశాతం కూడా సేకరించలేకపోయిందని యాపిల్ రైతులు తెలిపారు. కోట్ల కొద్ది యాపిల్ బాక్సులు ఉంటే.. అందులో కనీసం రెండు లక్షల బాక్సులను కూడా తరలించలేకపోయిందని రైతులు వాపోయారు. ఇదంతా ఇలా ఉంటే.. నవంబర్ 7వ తేదీన కురిసిన భారీ మంచువర్షంతో చెట్లపై ఉన్న యాపిల్ పండ్లన్నీ నేలరాలాయని.. దీంతో రైతులు భారీగా నష్టపోయారని “అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ” వెల్లడించింది. ఈ భారీ మంచు వర్షం కారణంగా 80% పైగా వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయన్నారు. 23,640 హెక్టార్ల పండ్ల తోటలలో 35% దెబ్బతిన్నాయని అంచనాకి వచ్చారు. అంతేకాదు.. ఇటు కుంకుమపువ్వు పంటలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం మీద కశ్మీర్ యాపిల్ రైతన్నలు దాదాపు రూ.7 వేల కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు “అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ” వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కశ్మీర్ యాపిల్ రైతుల భారీ నష్టాలను చవిచూసారని.. దీనిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని.. కేంద్రం వీరిని ఆదుకోవాలని “అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ” డిమాండ్ చేసింది.