Covid Tablets: గుడ్ న్యూస్.. కరోనా టాబ్లెట్స్ వచ్చేస్తున్నాయి.!
Covid Treatment: కరోనా బాధితులకు మరో గుడ్ న్యూస్. ఇకపై ఈ మహమ్మారిని ఎదుర్కునే ఔషధాలు మాత్రల రూపంలో రానున్నాయి. కోవిడ్-19ను ఎదుర్కునేందుకు...

కరోనా బాధితులకు మరో గుడ్ న్యూస్. ఇకపై ఈ మహమ్మారిని ఎదుర్కునే ఔషధాలు మాత్రల రూపంలో రానున్నాయి. కోవిడ్-19ను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఔషధాలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘మెర్క్’.. రిడ్బ్యాక్ బయోథెరపీటిక్స్ సహకారంతో ‘మోల్నుపిరవిర్’ అనే ఔషధాన్ని తయారు చేసింది. ఈ ఔషధంపై నిర్వహించిన క్లినికల్ ట్రయిల్స్లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది. మరణాల సంఖ్యతో పాటు కొత్తగా వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్యను కూడా 50 శాతం మేరకు తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. త్వరలోనే ఈ ఔషధాన్ని మాత్రల రూపంలో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు మెర్క్ ఫార్మా ప్రకటించింది.
రిడ్జ్బ్యాక్ బయోథెరపిక్స్, మెర్క్ ఫార్మా సంస్థలు కలిసి సంయుక్తంగా ‘మోల్నుపిరవిర్’ ఔషధంపై క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించాయి. ఈ ప్రయోగాలను 775 మంది వాలంటీర్లపై చేపట్టారు. కోవిడ్ లక్షణాలు బయటపడిన ఐదు రోజుల్లోపు ‘మోల్నుపిరవిర్’ మాత్రలను వినియోగించిన వారిలో సగం మందికి ఆసుపత్రి చేరిక అవసరం లేదని గుర్తించారు. అలాగే కోవిడ్ వేరియంట్లు గామా, డెల్టాలపై కూడా ‘మోల్నుపిరవిర్’ ప్రభావం చూపిస్తుందని మెర్క్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. “ఈ పరిశోధనలు ఆధారంగా వీలైనంత త్వరగా యూఎస్ ఎఫ్డీఎకు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్(ఈయూఏ) కోసం ఒక దరఖాస్తును సమర్పించాలని మెర్క్ సంస్థ యోచిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఫార్మా సంస్థలకు కూడా మార్కెటింగ్ దరఖాస్తులను సమర్పించాలని అనుకుంటోంది”.