Coronavirus: ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల పెరుగుదల తీరు..
కొత్తగా వస్తోంది. సరికొత్త రాగంతో మెల్లమెల్లగా భయం పుట్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న తీరు.. ఆందోళన కలిగిస్తోంది. కేసులు మాత్రమే కాదు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం.. పాత రోజుల్ని గుర్తుకు తెస్తోంది. ఇంతకీ భారత్లో కొవిడ్ అప్డేట్స్ ఏంటి?

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి.. అంతకంతకూ విజృంభిస్తోంది. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 685 కొత్త కరోనా కేసులు నమోదు కాగా… మొత్తం బాధితుల సంఖ్య 3, 395కి పెరిగింది. కొత్తగా జనవరిలో మొదలైన కరోనా వ్యాప్తి వల్ల.. ఇప్పటివరకూ 26 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
కేసుల్లో కేరళదే టాప్ ప్లేస్
కొవిడ్ 19 యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో.. కేరళ టాప్ ప్లేసును దక్కించుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,336 యాక్టివ్ కేసులు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో 467 కేసులతో మహారాష్ట్ర, 375 కేసులతో ఢిల్లీ 265 కేసులతో గుజరాత్, 234 కేసులతో మన పక్కరాష్ట్రం కర్నాటక.. 205 కేసులతో వెస్ట్ బెంగాల్.. టాప్ ఫైవ్ జాబితాలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెద్దగా కనిపించడం లేదనే చెప్పాలి.
ఎప్పటికప్పుడు కేంద్రం మానిటరింగ్
కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడమే కాదు, వైరస్ కారణంగా మృతిచెందుతున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అందుకే పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వైరస్ ప్రభావం చాలా తక్కువ స్థాయిలోనే ఉందనీ.. బాధితులందరికీ ఇంటి దగ్గరే నయమైపోతోందనీ అధికారులు చెబుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. పాజిటివ్ కేసుల శాతం 13.8గా ఉంటే.. డెత్ రేట్ 1.7శాతంగా ఉన్నట్టు ప్రస్తుత లెక్కల ప్రకారం స్పష్టమవుతోంది.
మొదటి మూడు పాతవే, నాల్గోదే కొత్తది
పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జన్యు శ్రేణి తక్కువ తీవ్రత కలిగిన ఓమిక్రాన్ సబ్వేరియంట్ల కారణంగా ఇన్ఫెక్షన్ పెరుగుదల కనిపిస్తోందని.. ICMR నిపుణులు అంచనా వేస్తున్నారు. నాలుగు ఓమిక్రాన్ సబ్వేరియంట్లు LF.7, XFG, JN.1, NB.1.8.1లు ప్రస్తుత ఇన్ఫెక్షన్కు కారణమవుతున్నట్టు నిర్ధారించారు. వీటిలో మొదటి మూడు, తరచుగా కనిపిస్తాయనీ.. నాలుగోది మాత్రమే కొత్తగా వచ్చిచేరినట్టు చెబుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామంటున్న ఎక్స్పర్ట్స్.. అప్రమత్తత అవసరం అయినప్పటికీ, మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




