T20 World Cup: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ రద్దయితే సెమీఫైనల్ టికెట్ ఎవరికీ.. ఐసీసీ నిబంధన ఏంటంటే..?
T20 World Cup 2026 Semi Final Qualification Scenario: భారత్ – వెస్టిండీస్ జట్లు టీ20 వరల్డ్ కప్లో దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎదురెదురుగా తలపడుతున్నాయి. గతసారి భారత్ ఓటమి చవిచూసింది. ఈసారి సెమీఫైనల్ బెర్త్ కోసం మాత్రమే కాకుండా, పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో కూడా బరిలోకి దిగుతోంది.

T20 World Cup 2026 Semi Final Qualification Scenario: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ ఇప్పుడు ‘డూ ఆర్ డై’ స్థాయికి చేరుకుంది. మార్చి 1, 2026న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనున్న ఈ పోరు వర్చువల్ క్వార్టర్ ఫైనల్గా మారింది. గ్రూప్-1 నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరో ఈ మ్యాచ్తోనే తేలనుంది. అయితే, అభిమానుల్లో పెద్ద ప్రశ్న – ఈ మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే ఏ జట్టు సెమీఫైనల్కు చేరుతుంది?
మ్యాచ్ రద్దయితే ఎవరికీ సెమీఫైనల్ టికెట్..?
ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్ల పట్టికలో భారత్, వెస్టిండీస్ రెండూ 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) కారణంగా వెస్టిండీస్ రెండో స్థానంలో ఉంది. భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు 4 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్కు చేరుతుంది. కానీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే లేదా ‘నో రిజల్ట్’గా ముగిస్తే, ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లకూ ఒక్కో పాయింట్ కేటాయిస్తారు.
అలా జరిగితే భారత్, వెస్టిండీస్ రెండూ 3 పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు సెమీఫైనల్ అర్హత నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం వెస్టిండీస్ NRR +1.791గా ఉంది. భారత్ NRR -0.100తో చాలా వెనుకబడి ఉంది.
అందువల్ల మ్యాచ్ రద్దయితే వెస్టిండీస్ మెరుగైన NRR కారణంగా సెమీఫైనల్కు చేరుతుంది. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇది భారత అభిమానులకు పెద్ద నిరాశగా మారుతుంది.
మ్యాచ్ రోజున కోల్కతాలో వాతావరణం ఎలా..?
వాతావరణ నివేదికల ప్రకారం మార్చి 1న కోల్కతాలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మ్యాచ్ సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండే సూచనలు ఉన్నాయి. అంటే, పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఎక్కువ.
ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్-1 సమీకరణాలను పూర్తిగా మార్చేలా ఉంది. కాబట్టి, అభిమానులంతా ఈ కీలక పోరును ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




