Karnataka Congress War: కుంభకోణాలతో చిక్కుల్లో కాంగ్రెస్‌.. పరిస్థితిపై హైకమాండ్ ఆరా..!

ముడా స్కాం, వాల్మీకీ కార్పొరేషన్‌ కుంభకోణంతో కర్నాటక కాంగ్రెస్‌లో చిక్కుల్లో పడింది. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్‌ పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ముడా స్కాంపై సీఎం సిద్దరామయ్యకు గవర్నర్‌ నోటీసులు ఇవ్వడంపై కర్నాటక కేబినెట్‌ చర్చించింది.

Karnataka Congress War: కుంభకోణాలతో చిక్కుల్లో కాంగ్రెస్‌.. పరిస్థితిపై హైకమాండ్ ఆరా..!
Dk Shiva Kumar Siddaramaiah
Follow us

|

Updated on: Aug 01, 2024 | 9:43 PM

ముడా స్కాం, వాల్మీకీ కార్పొరేషన్‌ కుంభకోణంతో కర్నాటక కాంగ్రెస్‌లో చిక్కుల్లో పడింది. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్‌ పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ముడా స్కాంపై సీఎం సిద్దరామయ్యకు గవర్నర్‌ నోటీసులు ఇవ్వడంపై కర్నాటక కేబినెట్‌ చర్చించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే భూకేటాయింపులు జరిగాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు.

కర్నాటక కాంగ్రెస్‌లో మళ్లీ కల్లోలం మొదలయ్యింది. కర్నాటక స్కామ్‌లకు కేంద్రబిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై ముడా భూకుంభకోణం ఆరోపణలు రావడంతో పాటు , వాల్మీకి కార్పొరేషన్‌లో వందల కోట్ల స్కాంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌ అయ్యింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కాంగ్రెస్‌ హైకమాండ్‌ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు ఇద్దరు నేతలు. కర్నాటకలో సీఎంను మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ సీఎం, డిప్యూటీ సీఎంల హస్తిన పర్యటన హాట్‌టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ అగ్రనేతల ఆరా..

సిద్దరామయ్య, డీకే శివకుమార్‌తో భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, సూర్జేవాలా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగా తమ సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భేటీ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ అధిష్ఠాన పెద్దలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పడ్డ ఏడాదికే ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

సీఎం సిద్ధరామయ్యకు షాకాజ్‌ నోటీసు జారీ

ముడా భూముల వివాదంపై సీఎం సిద్దరామయ్యకు గవర్నర్‌ తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ షాకాజ్‌ నోటీసు జారీ చేయడం సంచలనం రేపింది. ముడా భూములకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ కార్యాలయం ఆదేశించింది. ముడా స్కాంపై కాంగ్రెస్‌ కేబినెట్‌ సమావేశంలో కీలక చర్చ జరిగింది. అయితే కేబినెట్‌ సమావేశానికి సీఎం సిద్దరామయ్య దూరంగా ఉన్నారు. తన పైనే ఆరోపణలు రావడంతో , ముడా స్కాంపై జరిగే కేబినెట్‌ సమావేశానికి తాను అధ్యక్షత వహించడం బాగుండదన్న అభిప్రాయాన్ని సిద్దరామయ్య వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అధ్యక్షతన ఈసారి కేబినెట్‌ సమావేశం జరిగింది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ముడా భూకేటాయింపులు

సీఎం సిద్దరామయ్యకు గవర్నర్‌ నోటీసులు పంపించడంపై కర్నాటక కేబినెట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ముడా భూకేటాయింపులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ముడా చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం వచ్చిన తరువాతే భూ కేటాయింపులు జరిగాయి. చట్టప్రకారమే ముడా ఆ భూమిని కేటాయించింది. సీఎం సతీమణి ఆ భూమిని కేటాయించాలని కోరలేదని డీకే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

బెంగళూరుకు ఢిల్లీ దూతలు

కర్నాటక కాంగ్రెస్‌లో తాజా పరిణామాలను పరిశీలించడానికి ఇద్దరు హైకమాండ్‌ దూతలు బెంగళూర్‌కు వస్తున్నారు. కేసీ వేణుగోపాల్‌తోపాటు రణదీప్‌ సూర్జేవాలా శనివారం బెంగళూరు విచ్చేస్తున్నారు. మరోవైపు, ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని, స్కామ్‌లో భాగమైన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ జూలై నెల 25న బీజేపీ నేతలు గవర్నర్‌కు ఓ మెమోరాండమ్‌ను సమర్పించారు. ఈ క్రమంలోనే గవర్నర్‌.. ముఖ్యమంత్రి స్పందన కోరినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. కాగా, గవర్నర్‌ పదవిని బీజేపీ రాజకీయంగా వాడుకొంటున్నదని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..