ఉద్యోగులకు శుభవార్త..మోదీ సర్కార్ కీలక నిర్ణయం..
కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయంతో భారీ ఊరట లభించనుంది....
కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయంతో భారీ ఊరట లభించనుంది. ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వీరికి ప్రొవిజనల్ పెన్షన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. రెగ్యులర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జారీ చేసేంత వరకు ఈ విధంగా పెన్షన్ అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం నెలకొన్ని కరోనా కల్లోల సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు హెడ్ ఆఫీస్లో పెన్షన్ ఫామ్స్ను సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సర్వీస్ బుక్తో కలిపి క్లెయిమ్ ఫామ్ను పే అండ్ అకౌంట్స్ ఆఫీస్లో సరైన టైమ్కు అందించలేకపోతున్నారని చెప్పారు. మరోవైపు కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆఫీస్ వర్క్ కూడా ఆగిపోయిందని చెప్పారు.
దీంతో ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి పీపీవో ఆర్డర్లు అందలేదని పేర్కొన్నారు. దీంతో పెన్షన్ జారీలో జాప్యం జరుగుతోందన్నారు. అందుకే వీరికి పెన్షన్ ఆలస్యం కాకూడదనే లక్ష్యంతో ప్రొవిజనల్ పెన్షన్ అందించేందుకు సిద్ధపడినట్లుగా తెలిపారు. వీరికి పీపీవో వచ్చేంత వరకు ప్రొవిజనల్ పెన్షన్ అందుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన దగ్గరి నుంచి 6 నెలలు లేదా ఏడాది పాటు ప్రొవిజనల్ పెన్షన్ అందిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.