AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Privatization: విమానాశ్రయాల ప్రైవేటీకరణలో స్పీడప్.. మార్చి నాటికి ఎన్ని ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించనున్నారంటే..

Privatization: ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని 13 ప్రముఖ విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Privatization: విమానాశ్రయాల ప్రైవేటీకరణలో స్పీడప్.. మార్చి నాటికి ఎన్ని ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించనున్నారంటే..
Airport
Shiva Prajapati
|

Updated on: Oct 26, 2021 | 10:00 PM

Share

Privatization: ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని 13 ప్రముఖ విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహిస్తోన్న విమానాశ్రయాల్లోని 13 ఎయిర్‌పోర్టులను వేలం వేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) ప్రాతిపదికన వేలం చేయనున్న 13 విమానాశ్రయాల జాబితాను విమానయాన మంత్రిత్వ శాఖకు పంపినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విమానాశ్రయాల బిడ్డింగ్‌ను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని బిడ్డింగ్.. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని సంజీవ్ కుమార్ తెలిపారు. గతంలోనే ఈ విధానాన్ని అనుసరించడం జరిగిందని, విజయవంతం కూడా అయ్యిందన్నారు. గ్రేటర్ నోయిడాలోని జేవార్ విమానాశ్రయానికి కూడా ఇదే మోడల్‌లో బిడ్ ప్రక్రియను నడిపినట్లు తెలిపారు. కాగా, కరోనా ఉన్నప్పటికీ.. ఈ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలకు 50 సంవత్సరాల మేర కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

13 విమానాశ్రయాలేంటంటే.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని ఏడు చిన్న విమానాశ్రయాలు, ఆరు ప్రధాన విమానాశ్రయాలను ప్రైవటీకరించనున్నారు. వారణాసి, ఖుషినగర్, గయా, అమృత్‌సర్, కాంగ్రా, భువనేశ్వర్‌, తిరుపతి, రాయ్‌పూర్‌, ఔరంగాబాద్, ఇండోర్‌, జబల్‌పూర్, తిరుచ్చి, హుబ్లీ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి.

వచ్చే నాలుగేళ్లలో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ.. నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ (ఎన్‌ఎంపీ)లో భాగంగా వచ్చే నాలుగేళ్లలో 13 సహా 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తోంది. 2019లో మొదటి దశలో భాగంగా ఆరు విమానాశ్రయాలను అదానీ గ్రూప్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండవ దశ ప్రైవేటీకరణలో భాగంగా 13 విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయనున్నారు. కాగా, ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపని ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించనున్నారు.

కాగా, కరోనా సంక్షోభం కారణంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2021 ఆర్థిక సంవ్సత్సరంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ. 1,962 కోట్ల నష్టాన్ని చవిచూసింది. జీతాలతో సహా దాని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ. 1,500 కోట్లు అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి రావడం, ప్రయాణీకుల రద్దీ పెరగడంతో ఈ సంవత్సరం వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రుణాలు తీసుకోవలసిన అవసరం లేదని సంస్థ అధికారులు చెబుతున్నారు.

Also read:

Varavara rao: వరవరరావుకు బెయిల్ పొడిగింపు.. హైదరాబాద్‌కు తరలింపు విషయంలో మాత్రం..

IBPS Clerk 2021 Recruitment: 11 బ్యాంకుల్లో ఉద్యోగ భర్తీ.. దరఖాస్తు చేసుకున్నారా.. గడువు ముగుస్తోంది..

Hair Care: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ మీ కోసమే..