ఇక బార్డర్ దాటి రావాలంటే వణుకు పుట్టాల్సిందే.. రంగంలోకి పాములు, మొసళ్లు.. బీఎస్ఎఫ్ మాస్టర్ ప్లాన్..!
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె వేయడం సాధ్యం కాని చోట.. కాపలా కాయడం కష్టమవుతున్న వేళ.. బీఎస్ఎఫ్ సరికొత్త ఆయుధాలను నమ్ముకోబోతుంది. ఇకపై కేవలం జవాన్లే కాదు.. పాములు, మొసళ్లు కూడా పహారా కాయనున్నాయా? చొరబాటుదారుల వెన్నులో వణుకు పుట్టించేలా బీఎస్ఎఫ్ ప్లాన్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లు, స్మగ్లింగ్, నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక వినూత్నమైన వ్యూహాన్ని పరిశీలిస్తోంది. కంచె వేయడానికి వీలులేని నదీ ప్రాంతాలలో పాములు, మొసళ్లు వంటి ప్రమాదకర జంతువులను వదిలితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఆలోచిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దులో కొన్ని చోట్ల నదులు, చిత్తడి నేలలు ఉండటం వల్ల అక్కడ ఇనుప కంచె వేయడం సాధ్యం కావట్లేదు. ఇలాంటి చోట్ల నుంచే స్మగ్లర్లు, చొరబాటుదారులు దేశంలోకి వస్తున్నారు. వీరిని భయపెట్టి అడ్డుకోవడానికి పాములు, మొసళ్లు వాడాలని కేంద్ర హోం శాఖ సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బీఎస్ఎఫ్ తన క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.ఈ ప్రతిపాదన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9న ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ముఖ్యంగా పహారా కష్టతరంగా ఉన్న డార్క్ జోన్లలో రక్షణను పటిష్టం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
ఇందులో ఉన్న సవాళ్లు ఇవే
ఈ ఆలోచన వినడానికి కొత్తగా ఉన్నా, అమలు చేయడంలో కొన్ని పెద్ద చిక్కులు ఉన్నాయి. సరిహద్దుకు ఇరువైపులా చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు ఈ పాములు, మొసళ్లు గ్రామాల్లోకి వచ్చి సామాన్య ప్రజలను గాయపరిచే అవకాశం ఉంది. ఇన్ని పాములను, మొసళ్లను ఎక్కడి నుండి తీసుకురావాలి? వాటిని ఒకే చోట ఎలా ఉంచాలి? అనేది పెద్ద ప్రశ్న. జంతువులు మనం చెప్పినట్లు వినవు కాబట్టి, అవి సరిహద్దు దాటి అటు వైపు వెళ్తే పరిస్థితి ఏంటి? అనే సందేహాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితి
భారత్ బంగ్లాదేశ్ మధ్య మొత్తం 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో దాదాపు 371 కిలోమీటర్ల మేర ఇంకా కంచె వేయాల్సి ఉంది. ఈ ఖాళీ ఉన్న చోట్ల ప్రస్తుతం టెక్నాలజీని వాడుతున్నారు. మరోవైపు మొబైల్ సిగ్నల్స్ లేని డార్క్ జోన్ ప్రాంతాలను గుర్తించి, అక్కడ నెట్వర్క్ పెంచే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ జంతువుల వాడకం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే, ఇది ఇంకా అమల్లోకి రాలేదు.
