AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. బిక్స్ వేదికగా ఇరాన్ ప్రెసిడెంట్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ!

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య BRICS సదస్సులో ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ భేటీ అయ్యారు. ప్రాంతీయ శాంతి, నౌకాయాన భద్రత, చాబహార్ పోర్టు ప్రాధాన్యంపై చర్చించారు. అన్ని సమస్యలకు చర్చలే పరిష్కారమని మోదీ పునరుద్ఘాటించారు. ఆర్థిక సహకారం, వాణిజ్యం బలోపేతంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. ఇది భారత్ దౌత్యపరమైన ప్రాధాన్యతను చాటింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. బిక్స్ వేదికగా ఇరాన్ ప్రెసిడెంట్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ!
Narendra Modi, Masoud Pezeshkian
Balaraju Goud
|

Updated on: Sep 11, 2026 | 9:48 PM

Share

న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరువురు నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ పరిణామాలు, శాంతి, నౌకాయాన స్వేచ్ఛ, సముద్ర భద్రత వంటి అంశాలపై చర్చించారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియన్‌తో సమావేశమయ్యారు. రెండు వారాల వ్యవధిలో ఇరువురు నేతలు సమావేశం కావడం ఇది రెండోసారి. అంతకుముందు ఆగస్టు 31న బిష్కెక్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా వారు భేటీ అయ్యారు.

పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ

ప్రధాని మోదీ – పెజెష్కియన్ భేటీలో పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సమస్యలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు నిరంతర ప్రయత్నాలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య స్వేచ్ఛ, సముద్ర ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

బ్రిక్స్‌లో ఇరాన్ పాత్రపై మోదీ ప్రశంసలు

క్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితులు ఉన్నప్పటికీ బ్రిక్స్‌కు సంబంధించిన సమావేశాల్లో ఇరాన్ ఉన్నత స్థాయిలో నిరంతరం పాల్గొంటుండటాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. బ్రిక్స్ వేదికగా ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు చర్చించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ బ్రిక్స్ దేశాల మధ్య సహకారం కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకార నెట్‌వర్క్‌ల రూపంలో కార్యాచరణకు రావాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

‘‘ప్రపంచం అత్యంత క్లిష్ట దశలో ఉంది’’

బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్‌లో మాట్లాడిన పెజెష్కియన్.. ప్రపంచం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశల్లో ఒకదాన్ని ఎదుర్కొంటోందన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సరఫరా గొలుసుల అంతరాయాలు, రాజకీయ ఒత్తిళ్ల కోసం ఆర్థిక సాధనాల వినియోగం పెరగడం ప్రపంచ ఆర్థిక పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చాయని తెలిపారు. బ్రిక్స్ బలం కేవలం సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణంలో లేదని.. ఆ సామర్థ్యాలను వాణిజ్యం, పెట్టుబడులు, పరస్పర ఆర్థిక సహకారంగా మార్చినప్పుడే దాని అసలైన శక్తి బయటపడుతుందని ఆయన అన్నారు.

చాబహార్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యత

ప్రధాని మోదీ – పెజెష్కియన్ సమావేశం నేపథ్యంలో చాబహార్ పోర్టు కీలక అంశంగా మారింది. భారత్‌కు మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాలతో అనుసంధానానికి చాబహార్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ప్రాంతీయ వాణిజ్యం, రవాణా మార్గాల అభివృద్ధిలో భారత్-ఇరాన్ సహకారం కొనసాగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరాలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం వంటి అంశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆర్థిక సహకారంపై దృష్టి

ఇరు దేశాలు ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, ఇంధన రంగాల్లో సహకారానికి అవకాశాలు ఉన్నాయి. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ ఆర్థిక సహకార మార్గాలను అభివృద్ధి చేయాలనే చర్చలు కూడా బ్రిక్స్ వేదికపై ప్రాధాన్యం పొందుతున్నాయి.

ఎందుకు కీలకం?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మోదీ–పెజెష్కియన్ భేటీ జరగడం భారత్‌ దౌత్యపరమైన ప్రాధాన్యతను మరోసారి చాటింది. భారత్ ఒకవైపు ఇరాన్‌తో వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రాంతీయ సమస్యలకు సంభాషణ, దౌత్యమే పరిష్కార మార్గం అనే తన వైఖరిని స్పష్టం చేస్తోంది.

బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, చాబహార్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం, వాణిజ్య మార్గాలు, సముద్ర భద్రతను కాపాడటం భారత్‌కు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మోదీ–పెజెష్కియన్ తాజా సమావేశం పశ్చిమాసియా పరిణామాలపై భారత్ అనుసరిస్తున్న సమతుల్య దౌత్యానికి ప్రాధాన్యతనిచ్చిన భేటీగా నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us